పార్టీలందు జాతీయ పార్టీలు వేరయా…!
జాతీయ పార్టీలందు బీజేపీ వేరయా…!
బీజేపీ యందు వర్గాలు వేరయా…!
పార్లమెంటు నందు 335 స్థానాలు ఉండొచ్చు గాక…, గడిచిన ఆరేళ్లలో ఉత్తరాదిన బాగా బలపడి ఉండొచ్చు గాక…, దక్షిణాదిన పాగా వేయడానికి ప్రణాళికలు వేసి ఉండొచ్చు గాక…, తెలుగు నాట యోధాను యోదులను పార్టీలో చేర్చుకుని ఉండొచ్చు గాక… ఏపీలో బలోపేతానికి అందర్నీ చేర్చుకుని ఉండొచ్చు గాక…! కానీ అమిత్ షా కి దొరకని బుర్రలు.., మోడీకి తట్టని బుర్రలు.., జెపి నడ్డాకి కొరకరాని నాయకులూ ఏపీ బీజేపీ సొంతం. మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ రకరకాలు. కమ్మ బీజేపీ (తెలుగు బీజేపీ).., కాపు బీజేపీ (పవనుడి బీజేపీ).., కేంద్ర బీజేపీ ఉన్నాయి. వీరిలో ఒక్కొక్కరికీ ఒక్కో అజెండా. అదేమిటో తెలుసుకుందాం పదండి.
రమేష్ కుమార్ తో కలయిక వెనుక…!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సుజనా, కామినేని శ్రీనివాస్ ల చర్చల ఆంతర్యం ఏమిటి..? ఇది కనుక్కోవడం పెద్ద విషయం ఏమి కాదు. నిమ్మగడ్డని తొలగించడానికి జీవో తెచ్చిన నాటి నుండి అతనికి అనుకూలంగా కోర్టులో పిటిషన్ వేసినప్పటి నుండి కామినేని.., ఆ నిమ్మగడ్డతో అత్యంత సన్నిహితుడిగా మారి తెర వెనుక మద్దతు దారుడిగా ఉన్నారు. జగన్ “కమ్మ” సామజిక వర్గాన్ని టార్గెట్ చేయడం నచ్చక.., నేరుగా మీడియా ముందే కొన్ని మాటలు అనడాన్ని జీర్ణించుకోలేని ఆ సామజిక వర్గ పెద్దలు ఇలా రమేష్ కుమార్ పేరిటా పావులు కదుపుతున్నారు. అందుకే రమేష్ కుమార్ అంత ధీమాగా జగన్ తో ఢీ కొంటున్నారు. దీనిలో భాగంగానే ఏదో మాట్లాడడానికి కలుసుకుని ఉంటారు. ఇది పెద్ద అంశమే కాదు. ఇది సాధారణమే. ఇక్కడ కీలక అంశం ఏమిటంటే… బీజేపీ ప్రతినిధులుగా కలిసారా..? సామజిక వర్గ ప్రతినిధులుగా కలిసారా..? చంద్రబాబు సన్నిహితులుగా కలిసారా..? అనేది మాత్రమే ఇక్కడ తెలసులైన అంశం. ఏది ఏమైనా ఈ వర్గం మొత్తం కమ్మ బీజేపీ (తెలుగు బీజేపీ అని కూడా అనుకోవచ్చు). ఇక్కడ పెద్దగా గ్రహించలేని విషయం ఏమిటంటే దీన్ని నడిపేది చంద్రబాబు అనే అందరూ సందేహిస్తుంటారు. కానీ ఆ బాబుకి కూడా కేంద్రాన సన్నిహితంగా ఉండే మరో రాజకీయ, రాజ్యాంగ పెద్ద అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారు. ఆయనే కమ్మ బిజెపికి అసలు బాస్.
పవనుకి ప్రాధాన్యత వెనుక…!
ఇక రెండో రకం కాపు బీజేపీ. ఇది బయటకు పెద్దగా కనిపించకపోయినా లోలోపల చేయాల్సినవి చేసుకుపోతుంది. అటు చంద్రబాబుకి, ఇటు జగన్ కి విరుద్ధం అంటూ ప్రకటిస్తూనే లోలోపల లావాదేవీలు నడిపిస్తుంటుంది. దీనిలో కన్నా లక్ష్మీనారాయణ సహా.., సోము వీర్రాజు, మాణిక్యాలరావు లాంటి వారు ఉన్నారు. ఎవరు ఉన్నా, ఎంతమంది ఉన్నా దీనికి అనధికారిక బాస్ మాత్రం పవన్ కళ్యాణ్. సామాజికవర్గం అండగా ఉంటూ, కేంద్ర స్థాయిలో రాజకీయం నడపాలనేది ఈ విభాగం లక్ష్యం. అందుకే ఇటు బాబుకి, అటు జగన్ కి సమాంతర దూరం పాటిస్తున్నట్టు మాటలు చెప్పుకుంటూ మాంచి రాజకీయం నడిపిస్తుంటారు. వీరిలో ఎవరు, ఎప్పుడు..? ఏం మాట్లాడినా రెండోరోజుకు స్పష్టత ఉండదు.
అసలు బీజేపీ వేరు సుమీ…!
ఇక్కడ మరో కీలక అంశాన్ని చర్చించాలి. కేంద్ర బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రెండు విభాగాలు ఇక్కడి రెండు పార్టీలకు, సామజిక వర్గాలకు కొమ్ముకాస్తూ కేంద్ర అధికారాన్ని అనుభవిస్తుంటాయి. మరి నిమ్మగడ్డని సుజనా, కామినేని ఎందుకు కలిశారు…? జగన్ ఏడాది పాలన ఎలా ఉంది..? జగన్ ప్రభుత్వంలో అవినీతి అంశాలు ఏమిటి…? చంద్రబాబు కి దూరంగా ఇంకా ఎవరెవరు బీజేపీలో చేరుతారు..? ఇలా ఎన్నో కీలక అంశాలు ఉన్నాయి. బీజేపీ మన రాష్ట్రంలో దృష్టి పెట్టాలె కానీ… జగన్ ని గజగజలాడించే.., చంద్రబాబుని పూర్తిగా హైదరాబాద్ కె పరిమితం చేసే స్థాయి పావులు కదిపే వీలుంది. ఇదే కేంద్ర బీజేపీ లక్ష్యం కూడా. కానీ ఈ బిజెపికి నాయకులూ లేరు. నడిపించే నాయకుడు లేనప్పుడు లక్ష్యం ఎంత చిన్నది అయినా చేరుకోవడం కష్టమే. అందుకే కేంద్ర బీజేపీ అనే అంశాన్ని పక్కన పెట్టి… కమ్మ బీజేపీ, కాపు బిజెపిని మాత్రమే ప్రస్తుతం చెప్పుకుందాం. మాట్లాడుకుందాం. మూడో రకం బీజేపీ ఏమైనా నిద్ర లేస్తే మళ్ళీ దీని గురించి మరింత లోతుగా చెప్పుకుందాం.