అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికలు రోజు రోజుకి ఎంతో ఆసక్తిగా మారుతున్న వేళ, ప్రపంచదేశాలు అన్ని అమెరికా ఎన్నికల ఫలితాల వైపు ద్రుష్టి సారించాయి. అయితే ఎన్నో మలుపులు తీరుగుతున్న అమెరికా ఎన్నికలలో సరికొత్త విషయాలు చోటు చేసుకున్నాయి. మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఓ ట్రాన్స్జెండర్, ఘన విజయాన్ని సాధించగా, కరోనా కారణంగా చనిపోయిన వ్యక్తిని అమెరికా వాసులు గెలిపించారు. మరోవైపు మేయర్ గా ఒక కుక్కను ఎన్నుకున్నారు.
ట్రాన్స్ జెండర్ ఘన విజయం :
అమెరికా రాజకీయాలలో నూతన అధ్యయనికి నాందిగా సారా మెక్బ్రైడ్ (30 )అనే ఒక్క ట్రాన్స జెండర్ ఘన విజయాన్ని సాధించారు. ఆమె డెల్వర్ స్టేట్ సెనెటర్గా ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున పొట్టి చేసిన ఆమె భారీ మెజారిటీ తో తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్టీవ్ వాషింగ్టన్ను ఓడించారు. లెస్బియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్ల హక్కుల సాధన కోసం కొంతకాలంగా ఆమె ఉద్యమిస్తున్నారు. ఎల్జీబీటీక్యూ సమస్యలను పరిష్కరించడానికి శ్రమిస్తున్నారు. సమాన పౌరసత్వం (ఈక్వాలిటీ యాక్ట్) చట్టం కోసం సారా మెక్బ్రైడ్ అనేక ఉద్యమాలను నిర్వహించారు. తోటి పౌరుల్లాగే, తమకూ సమాన హక్కులు కల్పించాలనే అంశం మీద ఎల్జీబీటీక్యూ అసోసియేషన్లతో కలిసి పని చేస్తున్నారు. ఇదివరకు హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ అమెరికా విభాగానికి జాతీయ ప్రెస్ సెక్రెటరీగా సారా వ్యవహరించారు. అధ్యక్షుడు ఒబామా యొక్క వైట్ హౌస్ లో ట్రైనీగా కూడా పనిచేశారు ఈమె.
మేయర్ గా కుక్క:
విల్బర్ అనే కుక్కని మేయర్ గా ఎన్నుకున్నారు అమెరికాలోని రాబిట్ హాష్ ప్రజలు. జాక్ రాబిట్ బీగల్, గోల్డెన్ రిట్రీవర్ అనే మరో రెండు కుక్కలతో పోటీపడిన విల్బర్, 13,143 అత్యధిక ఓట్లతో మేయర్గా గెలుపొందింది” అంటూ రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ బుధవారం ఫేస్బుక్లో ప్రకటించింది. ఒహియో నది వెంబడి ఉన్న ఒక ఇన్కార్పొరేటెడ్ కమ్యూనిటీ అయిన రాబిట్ హాష్, 1990 ల నుంచి కుక్కను దాని మేయర్గా ఎన్నుకుంటుంది. కమ్యూనిటీ నివాసితులు హిస్టారికల్ సొసైటీకి $ 1 విరాళం ఇవ్వడం ద్వారా ఓటు వేస్తారు. ఇక మేయర్గా ఎన్నికైన విల్బర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సేకరించిన విరాళాలను కాన్సర్ రోగుల కోసం పని చేసే స్వచ్చంధ సంస్థలకు అందిస్తారు అని రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ తెలిపింది. విల్బర్ ప్రతినిధి అమీ నోలాండ్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ, స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతు తెలుపుతూ నమ్మకంతో ఓటు వేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. లేడీ స్టోన్, 12 ఏళ్ల బార్డర్ కోలీ అనే కుక్క, పట్టణానికి రాయబారిగా తన స్థానాన్ని నిలుపుకుంది.
చనిపోయినా గెలిచినా వ్యక్తి:
కరోనా కారణంగా ఎన్నికలకంటే ముందే చనిపోయిన వ్యక్తిని ఆ ప్రాంత ప్రజలు వోట్లు వేసే గెలిపించారు. నార్త్ డకోటాకు చెందిన డేవిడ్ ఆండాల్(55) రిపబ్లికన్ పార్టీ తరపునుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్కు పోటీ చేస్తున్నాడు.ఎన్నికల ప్రచారంలో ఉండగా కరోనా బారిన పడిన డేవిడ్ ఆసుపత్రి లో చేరిన నాలుగు రోజులలోనే మరణించాడు. అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందే డేవిడ్ చనిపోవటంతో బ్యాలెట్ల నుంచి అతడి పేరును తొలిగించలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో అతని పేరును తీయకుండానే అధికారులు వోటింగ్ నిర్వహించారు. ఈ వోటింగ్ లో నార్త్ డకోటా ప్రజలు 35 శాతం మెజారిటీ ఓట్లుతో డేవిడ్ ని గెలిపించారు. నార్త్ డకోటా నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్కు ఎన్నికైన ఇద్దరు రిపబ్లికన్లలో డేవిడ్ ఒకరు.
గత రెండు రోజులుగా జరుగుతున్న ఎన్నికలు, ఫలితాలతో అమెరికా రాజకీయాలు వాడివేడిగా ఉన్న తరుణంలో, మరో పక్కఅగ్రదేశం అమెరికా కరోనా వైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ రెండు రోజులలోనే కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో 99,600 కొత్త కేసులు నమోదు కాగా, 1,112 మంది కరోనా వల్ల చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.