తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి అంటే అందుకు చాలా ఆస్కారం ఉంది కనుక ఎవరికీ పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అయితే అధికార వైసీపీ పార్టీలో మాత్రం ఒకరి వెంబడి ఒకరు నిర్వేదాన్ని ప్రదర్శిస్తుంటే అసలు తమ పార్టీ పైన ఎవరు ఎలా దాడి చేస్తున్నారో తెలియక జగన్ తో పాటు మిగతా హైకమాండ్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఒక్కసారిగా ఒక వర్గానికి చెందిన నాయకులు తమ అక్కసును వెళ్లగక్కారు ఉంటే కొద్ది కొద్దిగా ఇదంతా ఎవరి ప్లానో జగన్ కు అర్థమవుతోంది. దీంతో వెంటనే నాయకులకు వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నాడు.
ఇక విషయానికి వస్తే గడచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తమ వైపుకు తిప్పుకుంది. జగన్ ప్రభుత్వంలో బిసి వర్గాలకు ఒరిగిందేమీ లేదని మరియు అతని పాలన బీసీలకు వ్యతిరేకంగా తమ అనుకూల మీడియా ద్వారా బాగానే ప్రచారం చేసింది. తాజాగా జరిగిన అచ్చెన్నాయుడు మరియు కొల్లు రవీంద్ర అరెస్టులను అడ్డుపెట్టుకొని బీసీలను జగన్ ప్రభుత్వం అణగదొక్కుతోందని పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తీరు అందరికీ తెలిసిందే. అచ్చెన్నాయుడు మరియు మంత్రి కొల్లు రవీంద్ర కుమార్ అరెస్టు అయిన తీరు మరియు వారికి ఎప్పటికీ బెయిల్ లభించని పరిస్థితులను అడ్డంపెట్టుకుని టిడిపి వారు పరిస్థితిని తమ వైపు బాగానే తిప్పుకున్నారు.
ఇకపోతే ఈ విషయాన్ని గ్రహించలేక వైసిపి లోని కొందరు బీసీ నేతలు ప్రభుత్వంపై తమ అక్కసు వెల్లగక్కుతున్నారు. నిజంగానే మనకు అన్యాయం చేస్తున్నారా? అనే చర్చ పెట్టారు. అదే సమయంలో తాజాగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు బీసీ కేటగిరీలోవే కాబట్టి వాటిని బీసీలతోనే భర్తీ చేయాలని.. ఇలా చేయకపోతే.. అధిష్టానాన్ని ప్రశ్నించాలని కొందరు వ్యాఖ్యానించినట్టు పార్టీలో నెంబరు-2 విజయసాయిరెడ్డికే ఫిర్యాదులు అందాయి. అయితే పదవులు ఆశిస్తోన్న కొందరు వైసీపీ నేతలు ఈ డిమాండ్ పేరుతో సరికొత్త కుంపటికి తెరలేపారన్న చర్చలు కూడా వినపడుతున్నాయి.
అయితే జగన్ మాత్రం చాలా శ్రద్ధగా అసలు ఏమి జరిగింది అన్న అంశంపై ఆరా తీస్తున్నారట. ఇదే సమయంలో రఘురామకృష్ణంరాజు వ్యవహారంలోకి కాస్త ఉదాసీనత కనబర్చిన వైసీపీ కమాండ్ ఇప్పుడు మాత్రం అలాంటి వారిని ఆదిలోనే అదుపు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జగన్ సదరు బీసీ నేతలకు చంద్రబాబు ట్రాప్ లో పడినట్లు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి వారు ఎలాంటి తప్పు చేయకపోతే అటువంటి మాజీ మంత్రులను అరెస్టు చేసే ధైర్యం అధికారులకు, పోలీసులకు ఉంటుందా? అసలు వారి పై అంత పెద్ద పెద్ద నేరాలు ఎవరు మోపగలరు? ఇక వారు ఎలాంటి తప్పు చేయకపోతే ఈపాటికి బెయిల్ పై బయటకు వచ్చి పరువునష్టం దావా వేయరా? అనే ప్రశ్నలను జగన్ సంధిస్తున్నారు.
మరి బీసీ నేతలు వారి అధినేత చెప్పిన మాట వింటారా లేదా వైసిపి వారు అంటున్నట్లు బాబు ట్రాప్ లోనే పడి వైసీపీలో కొత్త చిక్కులు తెస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.