సీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని పిటీషన్
తెలంగాణకు నష్టమంటూ వాదన
ఏపీ..తెలంగాణ మధ్య కొద్ది రోజులగా వివాదాస్పదంగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్ణయం పైన తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఈ పధకం కోసం జారీ చేసిన ఉత్తర్వుల ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది.
ఇప్పటికే ఇదే అంశం పైన అటు ఏపీ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఏపీకి దక్కే వాటాలో ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించుకుంటామని..తెలంగాణకు నష్టం ఉండదని చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి దీని కారణంగా ఏపీ సీఎం జగన్ తో తనకు వివాదం రాదని..సమస్యను పరిష్కరించుకుం టామని గతంలోనే స్పష్టం చేసారు. కేంద్ర జలశక్తి శాఖ రోజునే రెండు రాష్ట్రాల నీటి వివాదాల పైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా..అందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది.
ఈ నెల 20వ తేదీ తరువాత సమావేశం ఏర్పాటు చేయాలని లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు పైన టెండర్ల ప్రక్రియ..జ్యుడిషియల్ రివ్యూ మొదలు పెట్టింది. తెలంగాణకు రావాల్సిన చుక్క నీరు కూడా వదులుకోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నేరుగా సుప్రీంలో ఈ-పిటీషన్ దాఖలు చేయటం ద్వారా…ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టు పైన న్యాయ పోరాటం ఆరంభమైంది.
సుప్రీంలో పిటీషన్..ప్రాజెక్టును అడ్డుకోండి
ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత పలుమార్లు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక సమస్యల మీద చర్చించారు. హైదరాబాద్ లోని ఏపీకి చెందిన సచివాలయ భవనాల అప్పగింత వంటి నిర్ణయాలు చకాచకా జరిగిపోయాయి. తెలంగాణ నుండి శ్రీశైలం వరకు భారీ ఎత్తిపోతల పధకానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కసరత్తు చేసారు. అయితే, అది ప్రతిపా దన స్థాయిలోనే నిలిచిపోయింది. కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ…రాయలసీమ ఎత్తిపోతల పధకానికి సంబంధించి జీవో జారీ చేసింది. దీని పైన తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాజకీయంగా విమర్శలు ఎక్కుపెట్టాయి.
ఏపీలో మాత్రం జగన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ అంశం మీద తెలంగాణ ముఖ్యమంత్రి జగన్ పైన మాత్రం ఎటువంటి విమర్శలు చేయలేదు. దీని ద్వారా జగన్ తో మీ స్నేహం కొనసాగుతుందా..అంటే ఖచ్చితంగా కొనసాగుతుందని సమాధానం ఇచ్చారు. ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం క్రిష్ణా రివర్ బోర్డుకు ఈ ప్రాజెక్టు మీద ఫిర్యాదు చేయటంతో..దీని పైన ముందుకు వెళ్లవద్దంటూ బోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ సైతం తమకు రావాల్సిన నీటి చుక్కను కూడా వదులుకొనేది లేదని స్వయంగా సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇదే ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఏపీ ప్రభుత్వ వాదన ఇలా…
ఈ ప్రాజెక్టు గురించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయం నుండి తెలంగాణలో విమర్శలు మొదలయ్యాయి. సమైక్య రాష్ట్రంలో నీటి పంపకాల్లో తెలంగాణ ప్రాంత భారీగా నష్టపోయిందని..ఇప్పుడు కూడా ఇటువంటి ప్రాజెక్టుల కారణంగా తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తమ పిటీషన లో పేర్కొన్నారు. దీని పైన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక నిర్ధిష్ట అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీని పైన ముఖ్యమంత్రి జగన్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఏడాది లో 15 రోజులు మాత్రమే వరద నీరు వస్తుందని..తెలంగాణకు ఎటువంటి నష్టం లేకుండా..
ఏపీకి దక్కే నీటి వాటాలోనే ఈ ప్రాజెక్టు ను వినియోగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, క్రిష్ణా ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లవద్దంటూ లేఖ రాయటం పైన సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఉత్తర్వులను రద్దు చేయాలని..టెండర్ల ప్రక్రియ ముందుకు పోకుండా అడ్డుకోవాలంటూ దాఖలు చేసిన పిటీషన్ పైన ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.