ఒకరిపై కోపం ఒకరితో స్నేహానికి దారి తీస్తుంది…! రాజకీయాల్లో ఇది ఎక్కువ. దీనికి సరైన ఉదాహరణ చంద్రబాబుపై కేసీఆర్ కోపం జగన్ తో స్నేహానికి దారితీయడం. వీరిద్దరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏడాది కిందట జరిగిన ఎన్నికల సందర్భంగా చిగురించిన ఈ బంధం ఒకరిపై ఒకరు బిస్కట్లు వేసుకుని, ఒకరి భజన ఒకరు చేసుకునేంతగా సాగింది. పాపం వీరి స్నేహంపై ఎవరి దిష్టి పడిందో ఇప్పుడు ఒకరిపై ఒకరు కారాలు- మిరియాలు నూరుకుంటున్నారు. నీటి రూపంలో ఇద్దరి మధ్య చెడింది. ప్రస్తుతానికి పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ… ఇది త్వరలోనే ప్రత్యక్ష పోరుకి, మాటల యుద్దానికి దారి తీయదని చెప్పలేం. ఇంతకు ఆ నీటి పోరు ఏమిటో, మాటల పోరు ఏమిటో మొత్తం తెలుసుకోవాల్సిందే.
కేసీఆర్ కోపం ఎందుకంటే…!
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసేలా కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలంటూ తీసుకున్న ఏపీ సర్కారు నిర్ణయాన్ని కేసీఆర్ తప్పు పడుతున్నారు. దీనికి సంబంధించిన జీవో ఇప్పటికే విడుదల కావటం.. ఈ సమాచారం తమకు ఇవ్వకుండా ఏపీ సర్కారు అనుసరించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఎత్తిపోతల పథకం గురించి ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. విభజన చట్టాలకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొత్త ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కారు షురూ చేయటం సరికాదని.. దీంతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటాయని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదు. ఈ పథకాన్ని అడ్డుకోవటం కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ పథకం గురించి కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టటం ఏపీ స్టేట్ చేస్తున్న తీవ్రమైన తప్పిదమన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు.
జగన్ స్పందన ఇలా ఉంది…!
కృష్ణా జలాల అంశంపై సీఎం జగన్ తనదైన శైలిలో స్పందించారు. నిన్న జరిగిన ఓ అంతర్గత సమావేశంలో సింపుల్ గా వ్యాఖ్యలు చేశారట. ఆయన ఏమన్నారంటే “ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లులేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని చెప్పారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటికేటాయింపులు చేస్తుందని తెలిపారు. ఆ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం కూడా ఉండదని చెప్పారు. ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామన్నారు.
జగన్ చెప్పిన లెక్క ఇదీ…!
శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల తీసుకునే అవకాశం ఉందని జగన్ చెప్పారు. ఆ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండదన్నారు. ఆ పదిరోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అదే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టమన్నారు. ఇక 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే నీళ్లు వేయి క్యూసెక్కుల మాత్రమేనని సీఎం జగన్ తెలిపారు. ఇలా జగన్ లెక్కలు బయటకు తీసి తమ అవసరాలను చెప్పడంతో నీటి యుద్ధం ఇక ప్రత్యక్షమయింది. అటు కేసీఆర్ కోర్టులు అంటున్నారు, ఇటు జగన్ తమ వాటానే అంటున్నారు. చూడాలి, ఈ పోరు ఎంత వరకు వెళ్తుందో.