Lockdown : భారతదేశంలో కోవిడ్ అంతకంతకు విజృంభిస్తోంది అన్న సంకేతాలు బయటికి రావడం మొదలయ్యాయి. అయితే ప్రజల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రెండవ కోవిడ్ వేవ్ మొదలైంది అని దాదాపు కన్ఫర్మ్ చేసింది. కానీ ఈ విషయం ఇంకా పూర్తిస్థాయిలో ఇది ప్రజల వద్దకు ఎందుకు వెళ్ళలేదో అర్థం కావట్లేదు.
Lockdown : రాష్ట్రాలైతే జాగ్రత్తపడ్డాయి…
తెలంగాణలో రేపటి నుండి విద్యా సంస్థలు అన్నీ బంద్ అని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. నిన్ననే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఒంటిపూట బడులకి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇవి మొదలవుతాయి. ఈ లోపల ఈ రోజునుండి మాస్క్ పెట్టుకోని వారికి జరిమానా కూడా విధించాలి అని ఆయన ఆదేశించారు. ఇలా ఎన్ని మార్పులు వస్తున్నా జనాలు మాత్రం సామాజిక దూరం పాటించడం లేదు. మాస్క్ పెట్టుకునే సంగతి అటుంచితే కూడికలు కూడా ఎక్కువ అయిపోయాయి. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు యథావిధిగా జరుగుతున్నాయి.
లాక్ డౌన్ లేనట్టే…?
త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం కూడా మరో పూర్తి స్థాయి లాక్ డౌన్ ని విధించేందుకు సంశయిస్తోంది. దాదాపు లాక్ డౌన్ ఉండదనే చెప్పాలి. అంతే కాకుండా వీకెండ్ లాక్ డౌన్ వైపు కూడా మొగ్గుచూపే పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాలకు అవగాహన కల్పించే ప్రక్రియ ఒకటి చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరుగుతున్న పరిణామాలు మార్పులను బట్టి విపత్తు స్థాయిని అంచనా వేయడం ప్రజలందరికీ సాధ్యం కాదు. పైగా అది వారి జీవన విధానాన్ని దెబ్బతీసి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందని ఎవరి పాటికి వారు తమ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ సెకండ్ వేవ్ తీవ్రత గురించి కనీస అంచనా వేయలేకపోతున్నారు.
వ్యాక్సినే పరిష్కారం?
ఈ ప్రభుత్వం తప్పా… ప్రజల తప్పా అన్న విషయం పక్కన పెడితే… మరలా హెల్త్ బులిటెన్ లో కేసుల వివరాలు తెలుపవలసిన పరిస్థితి ఏర్పడాల్సి ఉంది. అయితే అలా చేస్తే ప్రతిపక్షం లాక్ డౌన్.. లాక్ డౌన్ అంటూ గొడవ చేస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం కరువవుతుంది. పైగా ప్రజల జీవితాలు కూడా అర్థికంగా అస్తవ్యస్తం అవుతాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ త్వరగా ప్రజలు చేరవేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే ఈరోజు యూనియన్ మినిస్ట్రీ కూడా 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇలా ఎన్ని మార్పులు జరుగుతున్నప్పుడు ప్రజలు తమ బాధ్యత తెలుసుకొని ప్రవర్తించాలి. ప్రభుత్వాలు కూడా మరికొంత విస్తృతంగా ప్రజల ముందు ఉన్న ముప్పు గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతైనా… పరిస్థితి చేయి దాటి పోతే పరిగెత్తి నిర్ణయాలు తీసుకోవడం తగదు కదా…!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?