తిరుమల వెంకన్న ఆస్తులకు రక్షణ దొరికింది. ఆయన భూములను ఆయనే రక్షించుకున్నట్టే…! నాడు 2016 లో టిడిపి ప్రభుత్వంలోనే టిటిడి బోర్డు అమ్మకానికి పెట్టింది అంటూ… నేడు వైసిపి ప్రభుత్వంలో టిటిడి బోర్డు అదే పూర్తి చేయాలని అనుకుని బొక్క బోర్లాపడింది…! కోటిన్నర కోసం స్వామి భూములే అవసరమయ్యాయా..? వేలకోట్ల ఆస్తులున్న స్వామికి ఈ చిన్న భూములకు రక్షణ కరువయ్యిందా…? దేవదేవుడి ఆస్తులపై ప్రభుత్వాల కన్నులు ఎందుకు పడుతుంది…? నాడు సదావర్తి భూముల వేలాన్ని అడ్డుకున్న వైసిపి నేడు శ్రీహరి భూములపై ఎందుకు ఈ ధోరణి అవలంభించిది…? … – అనేవి ఆసక్తికరంగా ఉన్నాయి. దీని వెనుక నాడు, నేడు కూడా ఏవో శక్తులు ఉన్నట్టు మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవేమిటో ఒక్కసారి తెలుసుకుందాం..!!
అత్యంత ధనవంతుడైన తిరుమల వెంకన్నసామి ఆస్తులను తితిదే అమ్మకానికి పెట్టింది. ఏంటి అంటే ‘అప్పుడు తెలుగుదేశం చేసింది.. ఇప్పుడు మేం చేస్తున్నాం..’ అనే వాదన తెరపైకి తెచ్చారు. ఇన్నాళ్లు నెమ్మదస్తుడిగా ఉన్న వైవి ఈ వివాదంతో అత్యంత చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. కప్పదాట్లుతో తనలోనూ అసలైన రాజకీయుడు ఉన్నాడని తేల్చి చెప్పారు.
సింపుల్ గా విషయం ఇదీ…!
తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన భూములను విక్రయించి నగదు సమీకరించుకోవాలని టిటిడి నిర్ణయించింది. నాడు టిడిపి ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది అని, నేడు తాము అమలు చేస్తున్నామని చెప్పుకుంటుంది. భక్తులు, వివిధ పెద్దల నుండి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30 తేదీన తితిదే ట్రస్టు బోర్డు 50 ఆస్తులు విక్రయించాలని తీర్మానించింది. దీనికి సంబంధించి తీర్మానం నెం.253 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
అగిన అమ్మకాలు ఇవే…!
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పసుమాముల, అంబర్ పేట కలాన్, మల్కాజిగిరి శివారు యాదవ్ నగర్ ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించారు. రెండోదశలో వీటిని అమ్మకానికి పెట్టాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. గుంటూరులోని కొత్తరాములు గుడి, పెదకాకాని మండలం నంబూరు, కృష్ణాజిల్లా పోలేపల్లి గ్రామ పరిధిలోని భూములను గుర్తించారు. విజయవాడ విద్యాధరపురంలో 7319.7 చదరపు అడుగుల స్థలం, తమిళనాడు నాగపట్నం జిల్లా పుసులంగుడిలో 17.65 ఎకరాల వ్యవసాయ భూమి, కాంచీపురం జిల్లా అగరంతేన్ గ్రామంలో 0.27 ఎకరాల ఫాం హౌజ్ స్థలం అమ్మాలని నిర్ణయించారు. మొత్తం 27 చోట్ల భూములను అమ్మేందుకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.
ఏం చేత కావట్లేదా…!
దేవదేవుడికి అనేక చోట్ల ఆస్తులున్నాయి. చిన్న, పెద్దా సంఖ్యలో భూములున్నాయి. వాటి రక్షణ టిటిడి పాలక మండలికి చేత కావట్లేదేమో. దేవుని ఆస్తులు రక్షించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. తెలుగు, తమిళనాడు రాష్ట్రాల్లో వేలం ద్వారా అమ్మాలనుకుంటున్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏ మాత్రం ఉపయోగపడవని, 1990లో ఇచ్చిన జీవో 311 మేరకు తితిదేకు ఆస్తుల విక్రయం, లీజుకిచ్చే అధికారాలు ఉన్నాయని వై.వి.సుబ్బారెడ్డి సమర్ధించుకుంటున్నారు. కానీ ఈ చిన్న ఆస్తులు భక్తులు దేవుడిపై భక్తితో ఆయనకు కానుకగా ఇచ్చారని, అవి విశ్వాసంతో ముడిపడి ఉన్నాయని ఆయన గ్రహించలేదేమో. ఈ భూములను వేలంలో ఎవరైనా కొనుక్కుని… ఏ అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తే నాడు దాతలు ఇచ్చిన దాతృత్వానికి విలువ ఏముంటుంది..? విశ్వాసాలు, సెంటిమెంటు, భక్తిలోని మూలాలు ఆలోచించకుండా ప్రభుత్వం ఇంత గుడ్డిగా వ్యవహరించడమే ఇక్కడ సందేహాలకు తావిస్తుంది. ఏమైనా ప్రశ్నిస్తే… మేము కాదు 2016 నాటి బోర్డు అనుకుంది, మేము పూర్తి చేటామంటూ సమర్ధించుకుంటున్నారు. అంటే 2016 నుండి 2019 వరకు టిడిపి హయాంలో వారికి అమ్మడం చేతగాక అమ్మకం జరపలేదని అనుకుంటున్నారా…? ఇలా ఆ భూముల అమ్మకం చుట్టూ అనేక సందేహాలు వస్తున్నాయి.
నాడు సదావర్తి విషయంలో రచ్చ… నేడు అంతకంటే ఘోరం వైపు…!
తమిళనాడుకి చెందిన సదావర్తి భూములలో ఆంధ్రాలో ఉన్న వాటిని నాడు ఏపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ ప్రక్రియని వైసిపి తీవ్రంగా వ్యతిరేకించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాడు కోర్టుకి వెళ్లారు, వైసిపి బృందం నాడు ఆ భూముల వద్దు, ట్రస్టు వద్ద పర్యటించింది. ట్రస్టుకు భక్తులు, దాతలు ఇచ్చిన భూములు అంటూ నానా హంగామా చేసింది. ఇప్పుడు అంతకంటే ఘోర తప్పిదానికి సిద్ధపడింది. విశాఖ శారదా పీఠాధిపతి సీఎం జగన్ కి ఫోన్ చేసి క్లాస్ తీసుకోకుంటే… భూములు అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమయ్యేదే. భక్తుల నమ్మకాలు, సెంటిమెంట్, విశ్వాసం… ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండేదే. చివరికి వివాదం పెద్దది కావడంతో నాటి ప్రభుత్వం పై నెట్టివేసేలా మాట్లాడుతూ సమర్ధించుకుంటూ ఉండేదే. కేవలం రూ. కోటిన్నర విలువైన అమ్మకాలకు ప్రభుత్వం అభాశుభాల పాలవుతుందని వైసిపి నాయకులూ కూడా అనుకోలేదు. ఈ భూముల అమ్మకం ప్రక్రియ నచ్చని అనేక మంది వైసిపి నేతలు లోలోపల
మధనపడుతున్నారు.
అసలు విషయం ఇదేనా…!
స్వామి ఆస్తులను నిరర్ధకం అంటున్నారు. చిన్న పాటి విస్తీర్ణ స్థలాలు అంటున్నారు. అందుకే నిర్వహణ భారం అంటున్నారు. సరే ఈ భూములను స్థానికంగా దేవాలయాల చేతిలో లేదా అక్కడున్న పాలకమండళ్లు చేతిలో పెట్టొచ్చుగా… లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పెట్టొచ్చుగా… ఇంత మాత్రం భూములను రక్షించలేక అమ్మేస్తాం అంటే… వేలాది మంది విశ్వాసాలు, సెంటిమెంటు ఏం కావాలి..? మూలాల్లోకి వెళ్లి ఆలోచించకుండా.., అమ్మకానికి సిద్ధ పడ్డారు అంటే ఆ భూములపై ఎవరి కన్ను అయినా పడిఉంటుంది అనే అనుమానాలు ఉన్నాయి. ఈ భూములను వేలం ద్వారా తక్కువకు కొట్టేయాలని ఆలోచనతో అక్కడి పెద్దలు ఎవరైనా పథకం వేసి… నాడు 2016 ప్రయత్నించి ఉండవచ్చు… నాడు విఫలమవడంతో నేడు మళ్ళీ అదే ప్రయత్నం తెరపైకి తెచ్చి ఉండొచ్చు… అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవేమి లేకుండా అప్పుడు టిడిపి ఎందుకు ప్రయత్నిస్తుంది, వెనకడుగు వేస్తుంది…? నేడు వైసిపి ఎందుకు ప్రయత్నిస్తుంది..? వెనకడుగు వేస్తుంది…? ఇది ఆ దేవదేవుడే తేల్చాల్సిన అతి పెద్ద వ్యవహారం. నాడు వ్యతిరేకించిన వైవి… వైసిపి నేడు ఒప్పుకోవడమేమిటి…? నాడు వారు ప్రయత్నించి ఆగిపోవడం ఏమిటి….? నేడు మళ్ళీ ప్రయత్నించడం ఏమిటి..? అసలు వెంకన్న భూములపై ఈ ఆటలేమిటో నాటి, నేటి పెద్దలకే తెలియాలి. మొత్తానికి రక్షణ మాత్రం వెంకన్నకే వదిలేయాలి.