హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నో
వారంలోగా హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి
ఏపీ ఎన్నికల కమిషనర్ గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. నిమ్మగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తోంది.హైకోర్టు గతంలో నిమ్మగడ్డను తొలిగింపును తప్పు బడుతూ..తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశాలిచ్చింది. దీని పైన మూడు సార్లు సుప్రీం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక, నిమ్మగడ్డ ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఆ సమయంలో హైకోర్టు చేసిన సూచనల మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి తనను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని కోరారు.
నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలంటూ గవర్నర్ సైతం ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయినా ప్రభుత్వం సుప్రీం కోర్టు విచారణకు వేచి చూడాలని నిర్ణయించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు సైతం వచ్చే శుక్రవారం లోగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని చెబుతూ.. స్టే కు నిరాకరించటంతో..ప్రభుత్వం ఇక ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వక తప్పని పరిస్థితి జగన్ ప్రభుత్వానికి ఏర్పడిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ప్రతిష్ఠకు పోయిన సీఎం జగన్…
తమకు సమాచారం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయటం..ఆ తరువాత తనకు రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాస్తూ వైసీపీ ప్రభుత్వం గురించి చేసిన వ్యాఖ్యలతో నిమ్మగడ్డ తీరు పైన సీఎం ఆగ్రహంగా ఉన్నారు. దీంతో..ఎన్నికల సంస్కరణల పేరుతో నిమ్మగడ్డను తప్పించి ఆ స్థానంలో జస్టిస్ కనగరాజును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని పైన రమేష్ కుమార్ హై కోర్టును ఆశ్రయిం చగా..అక్కడ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నిమ్మగడ్డను కొనసాగించాల్సిందేనంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం లో అప్పీల్ కు వెళ్లింది. హైకోర్టు ఉత్తర్వుల మీద స్టే ఇవ్వాలని మూడు సార్లు కోరింది. అయినా సుప్రీం కోర్టు ససేమిరా అంది. ఇక, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం అమలు చేయటం లేదంటూ నిమ్మగడ్డ తిరిగి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. దీని విచారణ సమయంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును తప్పు బడుతూ..తమ ఆదేశాలను గవర్నర్ కు వివరించాలని సూచించింది. అదే ప్రకారం గవర్నర్ ను నిమ్మగడ్డ కలిసి వినతి పత్రం ఇవ్వగా..ఆ వెంటనే నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, సుప్రీం లో విచారణ..అక్కడ నుండి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వారం రోజుల్లోగా హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి..
గవర్నర్ ఆదేశించినా..సుప్రీం సూచనల వరకూ వేచి చూడాలని భావించిన ప్రభుత్వానికి ఇప్పుడు అదే ఆదేశాలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు విషయంలో తొలి నుండి సుప్రీం న్యాయ మూర్తులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా..తాము ఈ కేసులో అన్ని విషయాలు తెలుసని అందుకే స్టే ఇవ్వటం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వుల మీద అభ్యంతరం ఉంటే వాదనలు వింటాం కానీ, ముందుగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ఇందు కోసం వారం రోజుల సమయం ఇచ్చింది. దీంతో..ఇక రాష్ట్ర రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించక తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో కనగరాజు నియామకాన్ని హైకోర్టు రద్దు చేయటంతో..ఆటో మేటిక్ గా నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల కమిషనర్ అయినట్లేననే వాదన ఉంది. ఇప్పుడు సుప్రీం తాజా వ్యాఖ్యలతో ప్రభుత్వం తిరిగి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇంకా..ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా అనే విధంగా ఆలోచిస్తుందా అనేది వేచి చూడాలి.