kalaavathi Song: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చుతున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ `కళావతి` వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ, పైరసీ వీరులు ఈ సాంగ్ను రెండు రోజులు ముందే నెట్టింట లీక్ చేయడంతో.. మేకర్స్ ఫిబ్రవరి 13న సాయంత్రం అధికారికంగా రిలీజ్ చేశారు.
అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అలపించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. అద్భుతంగా ఉన్న ఈ సాంగ్ యూట్యూబ్లో భారీ వ్యూస్, లైక్ను కొల్లగొడుతూ ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు `కళావతి` సాంగ్కు పెట్టి ఖర్చు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
మహేష్ బాబు, కీర్తి సురేష్ మాత్రమే కాదు.. సంగీత దర్శకుడు తమన్, గాయకుడు సిద్ శ్రీరామ్, ఇతర వాద్యాకారులతో కలర్ఫుల్గా ఈ పాటను చిత్రీకరించారు. అయితే ఈ లిరికల్ సాంగ్ కోసం నిర్మాతలు ఏకంగా రూ. 60 లక్షలు ఖర్చు పెట్టారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.