జాగర్లమూడి క్రిష్… కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. మంచి సినిమాలు తీస్తూ వరసగా హిట్స్ అందుకుంటున్న క్రిష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి తారక రామారావు జీవితాన్ని చూపించబోతున్నారు. దర్శకుడు తేజ మొదలుపెట్టినా కూడా ఎన్టీఆర్ సినిమా బాధ్యతలు క్రిష్ అందుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ పై హైప్ పెరిగింది. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా కన్నా ముందుకు క్రిష్, హిందీలో మణికర్ణిక సినిమా సైన్ చేశాడు.
కంగనా లీడ్ రోల్ ప్లే చేస్తూ రాబోతున్న ఈ సినిమాని క్రిష్ భారీగా తెరకెక్కిస్తుండగా చిత్ర యూనిట్ లో ఏదైనా ఇష్యూ జరిగిందో లేక బాలయ్య బలవంతం చేశాడో తెలియదు కానీ ఉన్నపళంగా దర్శకుడు క్రిష్, 30శాతం షూటింగ్ పూర్తి అయిన తర్వాత మణికర్ణికని వదిలేసి ఎన్టీఆర్ సినిమాకి షిఫ్ట్ అయ్యాడు. దీంతో మణికర్ణిక సినిమా ఆగిపోతుంది అనుకున్న సమయంలో కంగనా ముందుకి వచ్చి ఈ సినిమాని పూర్తి చేసి, రీలీజ్ చేయబోతుంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా నుంచి గతంలో టీజర్ వచ్చి అన్ని భాషల ప్రేక్షకులని మెప్పించగా, రీసెంట్ గా మణికర్ణిక తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు
ఆంగ్లేయ ప్రభుత్వం గద్దల్లాగా ఝాన్సీపై దృష్టి నిలిపి కూర్చుంది. ఝాన్సీకి సరైన సమయంలో వారసుడు లభించకుంటే.. వారు ఝాన్సీని కూడా ఆక్రమిస్తారు అనే డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. మణికర్ణిక ఎలా ఝాన్సీ లక్ష్మీబాయిగా మారింది, స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్ర సంబంధించిన అంశాలను ట్రైలర్లో అద్బుతంగా చూపించారు. మనం పోరాడుదాం.. దాని వల్ల భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి అనే ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రతి భారతీయుడిలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను అంటూ కంగన చెప్పే డైలాగ్ స్ఫూర్తిని రగిలిస్తోంది.ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిచడం విశేషం.