TTD Chairman: వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీలో నంబర్ టూల్లో ఒకరు. సీఎం జగన్ కి సొంత బాబాయి.. టీటీడీ చైర్మన్.. మూడు జిల్లాల అధికార పార్టీ ఇంచార్జి..! ఇంతకంటే ఆయనకు పరిచయాలు అవసరం లేదు..! కానీ వైవీ అంటే వివాద రహితుడు, సాత్విక స్వభావం కలవాడు, సైలెంట్ గా తన పని తాను చేసుకునే నాయకుడు, పంటిబిగువున కొన్ని రాజకీయ గాయాలను ఓరుస్తున్న రాజకీయుడు..! అటువంటి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయన మొదటి టర్మ్ లో రెండేళ్లు చైర్మన్ గా బాధ్యతల్లో ఉన్నారు. ఆ రెండేళ్లలో ఎన్నో వివాదాలు, ఎన్నో గొడవలు, ఎన్నో కేసులతో కొంత ఉక్కిరిబిక్కిరయ్యినా.., సావధానంతో పరిష్కరించుకోగలిగారు. వాటిలో టీటీడీ ఆస్తుల అమ్మకం, తిరుమల బస్సు టికెట్లపై యేసు బొమ్మ, శ్రీవారి పుస్తకంలో యేసు కీర్తన, ఎస్వీబీసీ ఆఫీసులో అస్లీల చిత్రాలు వీక్షణ అనే వివాదాలు కాస్త చెమటలు పట్టించినప్పటికీ.., వైవీ ఎక్కడా తొందర పడలేదు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ పరిష్కరించుకున్నారు..! తాజాగా ఈయన రెండో సారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక కూడా వివాదాలు వీడడం లేదు. ఈ వారం వ్యవధిలోనే రెండు పెద్ద వివాదాలు చుట్టేశాయి. మళ్ళీ వైవీకి పరీక్ష పెడుతున్నాయి..
TTD Chairman: జీడిపప్పుతో పురుగులు..! చిన్నదేం కాదు..!!
టిటిడి మార్కెటింగ్ గోడౌన్ కేంద్రంగా పురుగులు పట్టిన జీడిపప్పు సరఫరా జరిగినట్టు మూడు రోజుల నుండి వివాదం మొదలయింది. టీటీడీలో సిబ్బంది సహకారంతోనే ఈ నాసిరకం జీడిపప్పు సరఫరా జరిగిందని.., ఇది పెద్ద అవినీతి వ్యవహారం అంటూ ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీకి “హిందుస్థాన్ ముక్తా” అనే బెంగళూరుకి చెందిన సంస్థ జీడిపప్పును సరఫరా చేస్తుంది. గత నెల టీటీడీ అధికారులు రిజెక్ట్ చేసి వెనక్కు పంపించేసి 10 లోడ్లు జీడిపప్పుని అనధికారికంగా మళ్ళీ టీటీడీ గోదాములోనే పెట్టారు. అదే పురుగులు పట్టిన జీడిపప్పుని లారీలు తిరిగి “ప్యాకింగ్ మార్చి” “లారీ నెంబర్” మార్చి మళ్ళీ టీటీడీ కి సరఫరా చేశారు. దీనిలో ఇంటి దొంగల పాత్ర, విజిలెన్సు పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ కి సరఫరా చేస్తున్న కోట్లాది రూపాయల ముడిసరుకుల నాణ్యతను(శానిటరీ ఇన్స్పెక్టర్ స్థాయి) డిప్యూటేషన్ అధికారులు కూడా శ్రాధ తీసుకోవడం లేదు. టీటీడీ నిత్య అన్నదాన పథకానికి, లడ్డు తయారీకి, అనుబంధ ఆలయాలలో ప్రసాదాల తయారీకి కొనుగోలు చేస్తున్న ముడిసరుకుల నాణ్యత ప్రమాణాలపై సరైన నాణ్యత పరిశీలనా ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇది అత్యంత సున్నితమైన వ్యవహారం. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. దీంతో మూడు రోజుల నుండి ఈ వివాదం పెద్దదవుతుంది..
టీటీడీ బోర్డు.. కోర్టు మొట్టికాయలు..!!
మరోవైపు టీటీడీ కోసం ప్రభుత్వం నియమించిన “ప్రత్యేక ఆహ్వానితులతో నిండిన జంబో బోర్డుపై కోర్టు అభ్యంతరం చెప్పింది. ఈ జీవోకు సస్పెండ్ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులు ఏమిటి..!? అంటూ సీరియస్ కామెంట్స్ చేసింది. దీంతో జగన్ సహా.., టీటీడీ చైర్మన్ బాధ్యతల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి కూడా ఒత్తిడిలో ఉన్నారు. నిజానికి టీటీడీకి సాధారణంగా 25 నుండి 30 మంది మాత్రమే పాలకమండలి సభ్యులు ఉంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పంథాని మార్చేసింది. జంబో బోర్డు ఏర్పాటు చేస్తుంది. మొదటి టర్మ్ లో ఏర్పాటు చేసిన బోర్డుపై ఎటువంటి వివాదాలు లేవు.. కానీ రెండోసారి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆహ్వానితుల జీవో వివాదాస్పదం అయింది.
* మొత్తం 52 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉండగా.. దీనిలో తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ కి చెందిన బీజేపీ నాయకులే ఎక్కువగా ఉన్నారు.. కేంద్ర మంత్రుల సిఫార్సులతో కాదనలేక సీఎం జగన్ ఈ జంబో బోర్డుకి రూపకల్పన చేసి ఉండవచ్చు.. కానీ ఇది భక్తులకు ఇబ్బందికరమే. బోర్డులో రాజకీయ రంగు చేరడమే. అందుకే కోర్టు కూడా ఆక్షేపించింది.
* నిజానికి ఈ ప్రత్యేక ఆహ్వానితుల్లో చాలా మందికి టీటీడీ విలువ కూడా తెలిసి ఉండదు. ఏడాదికి రెండు, మూడు సార్లు వీవీఐపీ ఖాతాలో దర్శనం కోసమో.., తమ వాళ్లకి ఆ భాగ్యం కల్పించడం కోసమో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చి ఉంటారు. వాళ్ళెవరూ టీటీడీ సమావేశాలకు రారు, టీటీడీ పాలకమండలి నిర్ణయాల్లో తలదూర్చారు.., టీటీడీ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించరు. కేవలం రాజకీయ పలుకుబడితో దేవుడి దగ్గర ఆ పలుకుబడి చూపించే తాపత్రయంతో సిఫార్సులు చేయించుకుని “ప్రత్యేక ఆహ్వానితులు” అయ్యారు. దీనిలో సభ్యులుగా చేరిన వాళ్ళ కంటే అలా చేర్చిన సీఎం జగన్ దే పూర్తి బాధ్యత. మొత్తం అంగీకరించిన వైవీదె పూర్తి బాధ్యత.. అందుకే ఈ వివాదం వైవీ మెడ చుట్టూ తిరుగుతుంది..! రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ రెండు మచ్చలు తుడుచుకోవడం అంత ఈజీ కాదు.