కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ కలిసి నటించిన చిత్రం `ఆచార్య`. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తే.. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
బాక్సాఫీస్ వద్ద సగం వసూళ్లను కూడా రాబట్టలేక బొక్క బోర్లా పడింది. ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. అయితే తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిరు `గాడ్ ఫాదర్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆచార్య ప్రస్తావన వచ్చింది.
అందుకు చిరంజీవి స్పందిస్తూ `ఆచార్య సినిమా దర్శకుడి ఎంపిక. ఆయన ఏం చెప్పారో మేము అదే చేశాం. ఈ సినిమా వైఫల్యం నాపై ఏమాత్రం ప్రభావం చూపదు. చరణ్ను కూడా ఆ ఫెయిల్యూర్ పెద్దగా ప్రభావితం చేయదు.
అయితే ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క విచారం ఏంటంటే.. అది చరణ్ నేను కలిసి మొదటిసారి చేసిన సినిమా.. పరాజయం పాలైంది. ఒకవేళ భవిష్యత్తులో మేమిద్దరం మళ్లీ కలిసి నటించే అవకాశం వచ్చినా.. అంతటి జోష్ ఉండకపోవచ్చు.` అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి దర్శకుడు ఏం చెబితే అది చేశామంటూ చిరంజీవి `ఆచార్య` ఫెయిల్యూర్ మొత్తాన్ని కొరటాల మీదకు నెట్టేశాడు.