అర్ధరాత్రిళ్లు లేదా లేటుగా డిన్నర్ తినేవారి రక్తంలో చక్కెర శాతం విపరీతంగా పెరిగిపోతుందని ఓ సర్వేలో తేలింది. అంతేగాక శరీరానికి చేటు చేసే కొవ్వులు పెరిగి గుండె సమస్యలు వస్తాయని హెచ్చరించింది. చాలామందికి ఫ్రిజ్లో ఆహారం ఉన్నా లేకున్నా, దాన్ని తెరిచి చూడటం అలవాటు. ఒక వేళ అందులో ఏమైనా ఉంటే, తినకుండా వదిలిపెట్టరు.
ముఖ్యంగా నగర జీవితానికి అలవాటుపడే యువతకు ఎక్కువగా ఇదే అలవాటు. టీవీలు, సెల్ఫోన్లు చూస్తూ.. ఆలస్యంగా నిద్రపోతారు. ఫలితంగా రాత్రి వేళ చిరుతిళ్లు తింటూ టైంపాస్ చేస్తారు. తమకు నచ్చిన జంక్ఫుడ్ను లాంగించేస్తారు. అయితే, ఈ ఆహారం మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనల్లో తేలింది. నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెరశాతం పెరగటంతో పాటు కొవ్వుపదార్థాలు పెరిగి గుండె సమస్యలు పెరుగుతాయని, వీటితో పాటు మెదడుపై లేట్నైట్ ఫుడ్ అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్నైట్ జంక్ఫుడ్ తినే వారిని ప్రత్యేకంగా పరిశీలించారు. వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితులపై నిఘా పెట్టారు. నిద్రకు ముందు జంక్ఫుడ్, స్నాక్స్ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైనట్లు తెలుసుకున్నారు. ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని తెలుసుకున్నారు. రాత్రివేళ్ల జంక్ ఫుడ్ తింటే నిద్రలేమి సమస్యలు వేధిస్తాయని మరికొన్ని సర్వేలు వెల్లడించాయి. చూశారుగా.. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.అర్థరాత్రి పూట ఆహారం తినేవారు కాస్తంత ఆలోచిస్తే మంచిది. కాబట్టి రాత్రి తీసుకునే ఆహారం త్వరగా తినడానికి ప్రయత్నం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి .