తగినన్ని మంచినీళ్లు ఎందుకు తాగాలి? తాగకపోతే ఏమవుతుంది? నీరు ప్రాణాధారమని అందరికీ తెలుసు. అయితే శరీరానికి తగినంత నీరు ఇస్తున్నామా అన్నది ప్రశ్న. ఇస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఇవ్వకపోతే ఏమవుతుందో తెలిసిపోయినట్లేగా!
మలబద్ధకం రాదు:
నీళ్లు తాగకపోతే మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. మలబద్ధకం మనిషిని చికాకు పెడుతుంది. తగినంత నీరు తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. ఇతరత్రా కారణాలతో కూడా మలబద్ధకం రావచ్చనుకోండి. నీళ్లు తక్కువ తాగుతున్న కారణాన్ని ముందు రూల్ అవుటే చేయండి.
కీళ్లు బాగుంటాయి:
కీళ్ల దగ్గర ఎముకల మధ్య మృదులాస్తి అనే కణజాలం ఉంటుంది. అది ఎముకల మధ్య ఒరిపిడి లేకుండా కాపాడుతుంది. ఈ మృదులాస్థి ఎక్కువ భాగం నీరే. తగినంత నీరు తీసుకుంటే ఆరోగ్యకరమైన మృదులాస్థితో కీళ్లు బాగా పని చేస్తాయి.
చెమట పడుతుంది:
మనిషికి చెమట పట్టడం మంచిది. దానితో పాటు మలినాలు బయటకు వెళ్లడమే కాకుండా శరీరం ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వ్యాయామం చేసేప్పుడు మరిన్ని నీళ్లు తాగడం మరచిపోవద్దు.
డీహైడ్రేషన్ తప్పిచుకోవచ్చు:
నీరు తక్కువ తీసుకున్నపుడు చెమట ఎక్కువ పడితే శరీరానికి అవసరమైన పొటాసియం, సోడియం వంటి ఖనిజలవణాలు ఎక్కువ బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ వస్తుంది. అది ప్రమాదకరం.
మూత్రపిండాల ఆరోగ్యం:
తగినంత నీరు తాగితే మూత్రపిండాలు బాగా పనిచేసి మలినాలను విసర్జిస్తాయి. తగినంత నీరు తీసుకోకపోతే రక్తంలో మలినాలు పెరిగిపోతాయి. మూత్రపిండాలు మయోగ్లోబిన్ అనే ప్రొటీన్లతో ఇబ్బంది పడతాయి. ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మెదడు ఆరోగ్యం:
తగినంత నీరు శరీరానికి ఇవ్వకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. చాలాసేపు నీరు తాగకపోతే ఆలోచన మందగిస్తుంది, గమనించండి.
బరువు తగ్గొచ్చు:
తక్కువ నీరు తాగేవారితో పోల్చుకుంటే ఎక్కువ నీరు తాగేవారికి అధిక బరువు సమస్యలు సాధారణంగా ఉండవు. నీరు ఎక్కువ తాగితే జీవప్రక్రియలు సజావుగా సాగుతాయి. పొట్టలో నీరు ఎక్కువగా ఉంటే తిండి తినడం కూడా తగ్గుతుంది. అది మంచిదేగా!
గుండెపై భారం తగ్గుతుంది:
తగినంత నీరు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నీరు తగ్గినపుడు రక్తం కూడా తగ్గుతుంది. పైగా రక్తనాళాల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా రక్తపోటు పడిపోయి గుండె వేగం పెరుగుతుంది.
తగినంత అంటే ఎంత?
దీనికి సమాధానం విషయంలో ఏకాభిప్రాయం లేదు. కానీ ఆరోగ్యవంతులైన మనుషులు రోజుకు కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల వరకూ మంచినీళ్లు తాగితే చాలన్న మాటతో ఎక్కువ మంది ఏకీభవిస్తారు.
ఎక్కువ తాగితేనో?
అవసరానికి మించి ఎక్కువగా నీరు తీసుకున్నా సమస్యే సుమా! దానివల్ల శరీరంలో లవణాలు పలచబడిపోయి హైపోనేట్రిమియా అనే ఆరోగ్య సమస్య తతెత్తుతుంది.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.