BJP: రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు అనేది అందరికీ తెలుసు. ప్రజలు అధికారం ఇచ్చారు ఇక తాము ఏమి చేసినా చెల్లుతుంది అని పాలకులు అనుకుంటే పొరపాటు పడినట్లే. సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన బుద్ది చెబుతుంటారు. అందుకు ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మోడీ నేతృత్వంలో కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వీటిలో కొన్నింటిపై ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ తమకు అధికారం ఉంది. మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నట్లుగా ఆ నిర్ణయాలపై పునః సమీక్ష కూడా చేయడం లేదు. అందులో నూతన సాగు చట్టాలను ఓ ఉదాహారణగా పేర్కొనవచ్చు. నెలలు తరబడి ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నా, దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు నిర్వహించిన బంద్ లు విజయవంతం అయినా సాగు చట్టాల విషయంలో మోడీ నేతృత్వంలోని కేంద్రం వెనక్కు తగ్గడం లేదు.
BJP: ప్రజా వ్యతిరేక విధానాల ఫలితమే..
అదే మాదిరిగా పరిశ్రమల ప్రైవేటీకరణ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి, కార్మికులు, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండానే కేంద్రం ముందుకు వెళుతోంది. ఏపిలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినా వెనక్కు తగ్గేది లేదంటూ కేంద్రం వ్యవహరిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూనే ఉంది. మరో పక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటం, నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పర్యవసానాలు అన్నింటి కారణంగా దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చూసిన తరువాత అయినా కేంద్రంలోని బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపడితే తరువాతి ఎన్నికల్లో అనుకూల ఫలితాలను ఆశించవచ్చు.
29కి ఏడు స్థానాల్లోనే బీజేపీ గెలుపు
దేశ వ్యాప్తంగా 29 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అది కూడా అస్సోంలో మూడు, కర్ణాటకలో ఒకటి, మధ్యప్రదేశ్ లో రెండు, తెలంగాణలో ఒకటి గెలుచుకుంది. వాస్తవానికి తెలంగాణలో ఈటల గెలుపు బీజేపీ లెక్కలోకి వేసుకుంటే అది అవివేకమే అవుతుంది. అక్కడ ఈటల బీజేపీ బలంతో విజయం సాధించలేదు, ఆయన చరిష్మా, సానుభూతితో గెలిచాడు అనేది అందరికీ తెలిసిందే. సో..ఈ లెక్కన బీజేపీ ఆరు స్థానాలు మాత్రమే గెలుచుకున్నట్లు. ఇదీ కూడా అక్కడి స్థానికంగా సమర్ధ నాయకత్వ బలం ఉన్న స్థానాల్లో గెలిచాయి కానీ పార్టీ బలంతో కాదు అన్నది గుర్తెరగాలి. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న స్థానాలను కూడా బీజేపీ కోల్పోవడం ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా మోడీ, షా ద్వయం ఈ ఫలితాలపై విశ్లేషణలు చేసుకుంటారో లేదో చూడాలి మరి.