ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుండి బారత్ (కునో పార్క్) కు తీసుకువచ్చిన చిరుత పులులలో మరొక చిరుత (ధాత్రి, ఆడ చీతా) బుధవారం మృత్యువాత పడింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ధాత్రి మరణానికి గల కారణం పోస్టుమార్టం పరీక్షల ఫలితాల అనంతరం తెలుస్తుందని తెలిపింది. కాగా, గత ఆరు నెలల కాలంలో మొత్తం ఎనిమిది చిరుతలు మృతి చెందాయి. ధాత్రి మృతితో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. అంతరించిపోతున్న వన్య ప్రాణుల సంరక్షణ కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా నుండి ప్రత్యేక విమానాల్లో రెండు విడతలుగా 20 చిరుతలను తీసుకురావడం జరిగింది. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూనో పార్క్ లో వదిలారు.
అయితే ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతూ వచ్చాయి. గత నెలలో నాలుగు రోజుల వ్యవధిలో రెండు చిరుతలు మృత్యువాత పడ్డాయి. వరుసగా చిరుతల మృతి క్యూనో జాతీయ వనం వర్గాలను కలవరానికి గురి చేస్తొంది. నమీబియా నుండి తీసుకొచ్చిన చీతాకు నాలుగు పిల్లలు జన్మించగా, అందులో మూడు ప్రాణాలు కోల్పోయాయి. ఫలితంగా మొత్తం చీతా మరణాల సంఖ్య తొమ్మిదికి చేరినట్లైయింది. జీవించి ఉన్న పిల్ల చిరుతలను నిపుణుల సమక్షంలో పెంచుతున్నారు. ప్రస్తుతం కూనో పార్క్ లో ఇంకా 14 చిరుతలు ఉన్నాయి. వీటిలో ఒక ఆడ చిరుతను ఎన్ క్లోజర్ నుండి బయటకు వదిలి నిశితంగా పరిశీలిస్తున్నారు. దానిని తిరిగి ఎన్ క్లోజర్ లోకి తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలను చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు వివరించారు.
క్యూనో పార్క్ లో చిరుతలు వరుసగా మృతి చెందడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ కు, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జరిగేది ఇదేనంటూ వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తి గర్వం, వ్యక్తిగత ప్రతిష్ఠకు పెద్ద పీట వేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని పరోక్షంగా మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.