సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సభలో పలు కీలక విషయాలపై మాట్లాడనున్నారు. వీడ్కోలు ప్రసంగంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఏ అంశాలపై మాట్లాడతారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే .. ఆయనే స్వయంగా తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయనీ, వాటినట్టింటినీ వీడ్కోలు ప్రసంగంలో చెబుతానని పేర్కొనడం హాట్ టాపిక్ అయ్యింది.
సుప్రీం కోర్టులో విచారణ జాబితాలో ఉన్న ఓ కేసు తొలగించడం గురించి సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకువెళ్లారు. చివరి నిమిషంలో జాబితాలో ఉన్న కేసును తొలగించడం న్యాయవాదులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదనీ, ఈ విధానాన్ని ఖండించాలని అన్నారు దుష్యంత్ దవే. రిజిస్ట్రీ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో రిజిస్ట్రీ పని తీరుపై దుష్యంత్ దవే పలు ప్రశ్నలు లేవనెత్తగా.. జస్టిస్ రమణ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
పదవీ విరమణకు ముందు ఎలాంటి వ్యాఖ్యలు తాను చేయదల్చుకోలేదని, వీడ్కోలు ప్రసంగంలో అన్ని విషయాలపై మాట్లాడతాననీ, అప్పటి వరకూ వేచి ఉండండని జస్టిస్ రమణ సూచించారు. జస్టిస్ రమణ.. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నింటిపై వీడ్కోలు సభలో మాట్లాడతానని పేర్కొనడంతో అవన్నీ చాలా కీలకమైన విషయాలే అయి ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఆయన ఏ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేయనున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా, చర్చనీయాంశంగా మారింది. కాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ నేడు చివరి సారిగా ఏపికి రానున్నారు. ఈ రాత్రికి తిరుపతికి చేరుకోనున్న జస్టిస్ ఎన్వీ రమణ .. రేపు తిరుపతిలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహాత్మా గాంధీ ఆత్మకథ సత్య శోధన పుస్తకావిష్కరణ సభలో జస్టిస్ రమణ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించనున్నారు. భూమన ఆహ్వానం మేరకు జస్టిస్ రమణ తిరుపతికి వస్తున్నారు.
దక్షిణాది రాజకీయాలపై ఫోకస్ పెంచిన బీజేపీ .. రజనీకాంత్ కు బిగ్ ఆఫర్..?