దేశ రాజధాని హస్తినలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈ నెల 4వ తేదీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, ఈ రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఎగ్జిట్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో మేజిక్ ఫిగర్ అయిన 126 కంటే ఎక్కువ స్థానాల్లో ఆప్ విజయం సాధించి 15 ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ ఉదయం 8 గంటల నుండి 42 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరిగింది.
ఈ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 133 స్థానాలు కైవశం చేసుకోగా, బీజేపీ 105 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితం అయ్యింది. 2017లో జరిగిన ఎన్నికల్లో నాటి 272 వార్డులకు గానూ బీజేపీ 181 గెలుచుకుంది. ఆప్ 48 వార్డులు మాత్రమే గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కేవలం 30 వార్డులను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ 30 మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేషధారణలో చిన్నారులు సందడి చేశారు.
ఆప్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత పోటాపోటీగా ఫలితాలు వస్తుండటంతో ఆప్ నేతలు సందిగ్దంలో పడ్డారు. డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా, మంత్రి రాఘవ్ చద్దాలు ఆప్ బాస్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. కొద్ది సేపటికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అక్కడకు చేరుకున్నారు. చివరకు మ్యాజిక్ ఫిగర్ దాటి ఆప్ వార్డులను కైవశం చేసుకోవడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలను చేసుకుంటున్నారు.