Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు వివిధ రాజకీయ పక్షాల నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపే దిశగా వ్యూహాలను రచిస్తున్న దీదీ..రేపు జరగబోయే భేటీకి వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపారు. అయితే విఫక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్సీపీ నేత శరద్ పవార్ పేరు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని ఆయన ఖండించారు. తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో కీలక భేటీకి ఒక రోజు ముందు శరద్ పవార్ తో మమతా బెనర్జీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు జరిగే సమావేశానికి గానూ మమతా బెనర్జీ, శరద్ పవార్ లు ఈ రోజే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం శరద్ పవార్ నివాసానికి చేరుకున్న మమతా బెనర్జీ ఆయనతో భేటీ అయ్యారు. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, భేటీకి హజరయ్యే పార్టీల వైఖరి తదితర విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Presidential Election: పోటీ చేయాలన్న ఆలోచన లేదు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన శరద్ పవార్ జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క ఆయనకు వైరి వర్గాల్లోనూ ఆయనకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధిగా తాను పోటీ చేయడం లేదంటూ శరద్ పవార్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంపై మమతా బెనర్జీ ఆయనతో చర్చించినట్లు వార్తలు వినబడుతున్నాయి. శరద్ పవార్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కూడా మమతా బెనర్జీ అభ్యర్ధించినట్లు తెలుస్తొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న తరుణంలోనే దీదీ ఓ అడుగు ముందుకు వేసి సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది. మరో పక్క రాష్ట్రపతి ఎన్నికను వివక్షాలతో మాట్లాడి ఏకగ్రీవం చేయాలన్నట్లుగా బీజేపీ భావిస్తొంది. ఆ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ఇతర పక్షాలతో మాట్లాడే బాధ్యతలను పార్టీ అప్పగించింది.
Presidential Election: దీదీ భేటీ రాజకీయంపై సర్వత్రా ఉత్కంఠ
ఇదిలా ఉంటే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ రేపు ఢిల్లీలో జరిగే కీలక సమావేశానికి వెళతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. దీదీ ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఆహ్వానం పంపిన నేపథ్యంలో కేసిఆర్.. కాంగ్రెస్ పార్టీతో వేదికను పంచుకోవడానికి ఇష్టపడటం లేదని వార్తలు వినబడుతున్నాయి. అయితే తన ప్రతినిధిని సమావేశానికి పంపాలని కేసిఆర్ భావిస్తున్నారని తెలుస్తొంది. రేపు దీదీ నిర్వహిస్తున్న సమావేశానికి ఏయే పార్టీల నేతలు హజరు అవుతారు, వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.