Tragedy: కరోనా మహమ్మారి కుటుంబాలు కుటుంబాలను బలి తీసుకొంటోంది. కుటుంబంలో ఒకరికి వస్తే అందరినీ చుట్టేస్తుంది. సామాన్యులతో అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నా కొందరు కరోనాను జయించలేక మృత్యువాత పడుతున్నారు. ఓ రాజ్యసభ సభ్యుడి ఇంట 11 రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఒడిశాకు రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర (78)కు గత నెల 22 తేదీన కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా కుటుంబ సభ్యులు భవనేశ్వర్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీన ఆయన మృతి చెందాడు. ఇక్కడ మరింత ట్రాజిడీ ఏమిటంటే .. ఆయన ఇద్దరు కుమారులు కూడా కొద్ది గంటల వ్యవధిలో కరోనాతో కన్నుమూశారు. మహాపాత్ర మృతి చెందిన తరువాత ఆయన ఇద్దరు కుమారులు జశోబంత, ప్రశాంత కూడా కరోనా బారిన పడ్డారు. వీరిద్దరిని ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. ప్రశాంత బుధవారం కన్నుమూయగా, పెద్ద వాడైన జశోబంత 24 గంటలు గడవక ముందు గురువారం తుదిశ్వాస విడిచారు.
ఒడిశా రాష్ట్రంలో గొప్ప శిల్పిగా ఖ్యాతి గాంచిన రఘునాథ్ మహాపాత్రకు గతంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ఇచ్చి గౌరవించింది. ఆయన చిన్న కుమారుడు ప్రశాంత ఒడిశా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించారు. కొద్ది రోజుల వ్యవధిలో ఆయన తో పాటు ఇద్దరు కుమారులు కరోనాతో మృతి చెందడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.