అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన, వారి రక్షణకు చర్యలు తీసుకోవడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందనే మాటను పదే పదే చెప్పే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆటోలు, టాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అభయం ప్రాజెక్టు’ (యాప్)ను సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, పోలీసు, రవాణా శాఖలకు చెందిన పలువురు సీనియర్
అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, వివిధ జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.
విశాఖలో పైలెట్ ప్రాజెక్టు….
విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా అభయం ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. తొలి దశలో నగరంలోని 1000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తుండగా, వచ్చే ఏడాది నవంబరు నాటికి విశాఖతో పాటు, విజయవాడ, తిరుపతిలో లక్ష వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్లు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత ఈ ప్రాజెక్టును రవాణా శాఖ సహకారంతో అమలు చేస్తారు.
ఏమిటి ఈ ప్రాజెక్టు?:
– ప్రతి ఆటో, ప్రతి టాక్సీలో ఈ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఐఓటీ ఎక్విప్మెంట్ అనేది అమర్చడం జరుగుతుంది.
– ఆ ఆటో, టాక్సీ ఎక్కిన వెంటనే, ఆ అక్క చెల్లెమ్మ వద్ద స్మార్ ఫోన్ ఉంటే వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే, పూర్తి వివరాలు వెంటనే నమోదవుతాయి.
– దాంతో వారికి ఏ ఆపద వచ్చినా వెంటనే ఆదుకునేందుకు వీలవుతుంది.
– ఒక వేళ ఆ అక్క చెల్లెమ్మ వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోతే, రెడ్ బటన్ నొక్కితే, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆదుకునేందుకు వీలవుతుంది.
– దీని వల్ల అక్క చెల్లెమ్మలకు మనోధైర్యం పెరగడమే కాకుండా, మన ఆటోలు, మన టాక్సీలపై ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది.
– ఎందుకంటే మన వాళ్లంతా ఓలా, ఉబర్ వంటి బహుళ జాతి సంస్థలు నడిపే టాక్సీలతో పోటీ పడుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..:
తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు. “ ఈరోజు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసింది. అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ మహిళా పక్షపాత ప్రభుత్వం అని నిస్సందేహంగా చెప్పుకునేలా అడుగులు ముందుకు వేశాం. అక్క చెల్లెమ్మలు అన్ని రకాలుగా వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వం మనది.` అని ఆయన తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. “ ఆర్థిక స్వావలంబన కోసం అమ్మ ఒడి పథకం కానివ్వండి,ఆసరా పథకం కానివ్వండి,చేయూత పథకం కానివ్వండి, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అక్క చెల్లెమ్మల పేరుతోనే చేసే కార్యక్రమం కానివ్వండ, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి. ఇలా ఏ పథకాన్ని తీసుకున్న కూడా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేమడం వల్ల వారికి ఆర్థిక స్వావలంబన చేకూరే విధంగా చరిత్రలో నిల్చిపోయే ఒక ఘట్టం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది.“ అని ఆయన వెల్లడించారు.