Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డిని తక్షణం విధుల నుండి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించవొద్దని ఉత్తర్వులో పేర్కొంది. తనకంటే దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణం వెళ్లాలని వాసుదేవరెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకుంటున్నారనీ, వారికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల ఈసీకి లేఖ రాశారు. ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు సమాచారం.
మరో పక్క ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ, డీజీపీలను బదిలీ చేయాలని కూటమి నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు కోరారు. టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ నేత జీవీఎల్ నర్శింహరావు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని తెలిపారు.
ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. వారు ఆ పదవుల్లో కొనసాగితే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగే అవకాశం లేదని వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు వివరించారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలని కోరారు. కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారిని ఎన్నికల విధుల నుండి తప్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికల కమిషన్ ను కలిసిన తర్వాత వారు మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
Encounter: చత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి