CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అయిదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా భావిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.
నిందితుల సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నిందితుడి సమాచారం పోలీసులకు చక్కింది. అయితే నిందితుడు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్లు అని తెలుస్తొంది. మంగళవారం పోలీసు బలగాలు వడ్డెర కాలనీకి చేరుకుని పలువురు యువకులను వ్యాన్ లో ఎక్కించి తరలించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని రేపింది. అదుపులో తీసుకున్న వారిని పోలీసుల విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు సమాచారం తెలియడంతో వడ్డెర కాలనీ కుటుంబ లు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి.
అయితే అక్కడ తమ పిల్లల జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు ఆకతాయిగా కూడా రాళ్లు విసిరే బ్యాచ్ కాదని వడ్డెర కాలనీ వాసులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే కొందరు సెల్ ఫోన్ లో రికార్డు చేసిన వీడియో ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు దీనిపై మీడియా సమావేశంలో నిందితుల అరెస్టు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
మరో పక్క సీఎం జగన్ పై రాయి దాడి కేసులో తమ వారిని అక్రమంగా నిర్బంధించారంటూ వడ్డేర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. డాబా కొట్ల సెంటర్ లో పోలీసుల తీరుకు నిరసనగా రాస్తారోకో చేశారు. సీఎం రోడ్డు షో వద్ద తమ పిల్లలు లేకపోయినా అయిదుగురుని మంగళవారం తెల్లవారుజామున పోలీసులు తీసుకువెళ్లారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఆరోపించినట్లు ఈ దాడిలో కుట్ర, రాజకీయ కోణం ఉందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అకతాయులు చేసిన పనా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.