Veligonda Project: వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దశాబ్దాల కల సాకారం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తన తండ్రి వైఎస్ ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ గా జగన్ అభివర్ణించారు. టన్నెల్ లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందన్నారు. రెండు టెన్నెళ్లు ఒక్కొక్కటి 18.8 కిలో మీటర్లు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామని, ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుతో 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్లోరైడ్ పీడిత బాధితులకు నీరు అందించేందుకు రూపొందించిన ప్రాజెక్టు వెలిగొండ అని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించగా, ప్రాజెక్టు రెండు సొరంగాలు రాజశేఖరరెడ్డి కొడుకుగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఖరీలో నల్లమల సాగర్ కు నీరు తీసుకువస్తామని అన్నారు.
నిర్వాసితులకు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకెజీ కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేసి నీరు నింపుతామని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వంగా రికార్డు సొంతం చేసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నట్లు సీఎం జగన్ చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వంలో వెలిగొండ పనులు నత్తనడకన జరిగాయని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధి చందన్న, ఎంపీ అభ్యర్ధి బాస్కర్ లను అఖండ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంటరీ వైసీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్ధి తాడిపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.