అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలల్లో 2019-20 ప్రవేశాలకు గాను జేఎన్టీయూ కాకినాడ.. ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20-24 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
దరఖాస్తు ఫీజుగా రూ.500, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకునేవారు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఆన్లైన్, క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ అర్హత ఉన్నవారు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 4 వరకు, రూ. 1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ. 5,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ. 10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఏప్రిల్ 16 నుంచి ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఏప్రిల్ 20-23 వరకు రెండు సెషన్లలో, అగ్రికల్చర్ అభ్యర్థులకు ఏప్రిల్ 23, 24తేదీల్లో, రెండు పరీక్షలు రాసేవారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.