ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ ఇ సి గా మళ్లీ బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శితోనే సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని ఎస్ఈసీ కార్యదర్శి సుప్రీంకోర్టును కోరారు. కానీ ఆ ప్రయత్నమూ విఫలం అయింది. ఏపీ ప్రభుత్వం పిటిషను మీద విచారణ జరిపినప్పుడు హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి ఆర్డినెన్స్లు ఎలా జారీ చేస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
రాజ్యాంగ సంస్థలతో ఆటలాడుకోవడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఏపీ సర్కార్ ఎస్ఈసీ కార్యదర్శి ద్వారా మరో ప్రయత్నం చేసి౦ంది.అది వికటించడంతో ఇక ఇప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన పరిస్థితి ఏపీ సర్కార్పై పడింది. అంటే నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకునే విషయంలో ఏపీ సర్కార్ అడ్డు చెప్పకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇంతటితో వెనక్కు పోదని, ఇంకో ప్రయత్న౦ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే…ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డను కొనసాగించాలంటూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ తరపున కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మానసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టి.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
గతంలో ఏపీ సర్కార్ వేసిన పిటిషన్తో కలిపి వతదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇలాంటి పిటిషన్ వేసింది. అయితే.. అందులో హైకోర్టు తీర్పులో ఉన్న సాంకేతిక అంశాల ఆధారంగా.. గతంలో నిమ్మగడ్డ నియామకమే చెల్లదని ఏపీ సర్కార్ వాదించింది. దీనిపై వాదనలు వింటామని.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. దీంతో… ఆ తీర్పుని ప్రభుత్వం అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి!