BJP MP CM Ramesh: వైసీపీ సర్కార్ పై ఏపి బీజేపీ పోరుబాటకు సిద్దం అవుతోంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. నిన్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు జగన్ సర్కార్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపిలోని పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగాలేదని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని సీఎం రమేష్ ప్రశ్నించారు. ఏపిలో పోలీస్ వ్యవస్థ తీరుపై కేంద్ర హోంశాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందన్నారు. త్వరలోనే ఏపిలోని పోలీస్ వ్యవస్థను ప్రక్షాళనకు కేంద్రం చర్యలు తీసుకోబోతున్నదని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సక్రమంగా లేదనీ, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీకాల్ చేస్తుందని చెప్పారు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. పోతుంటాయి. వ్యవస్థలు ముఖ్యమనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని సీఎం రమేష్ అన్నారు. శిక్షణ సమయంలో ఐపీఎస్ లు ఏ విధంగా ప్రమాణం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు.
BJP MP CM Ramesh: ఏపి ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంబిస్తోంది
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామన్నారు రమేష్. ఏపిలోనూ అలాంటి పరిస్థితులే వచ్చాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ తొలి సారిగా సీఎం అవ్వడం వల్ల నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని అన్నారు. ఏపి ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తుందని రమేష్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి సినిమా రేట్లపై ఉన్నఇంటరెస్ట్ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28న విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహిస్తోందని సీఎం రమేష్ తెలిపారు.