ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర దిగ్భాంతికరమైన సంఘటన జరిగింది. హింధూ భక్తుల మనోభావాల దెబ్బతినేలా చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతున్నది. అంతర్వేదిలోని శ్రీ నర్శింహస్వామి వారి రథం దగ్ధం తరువాత రాష్ట్రంలో పలు ఆలయాలలో జరిగిన ఘటనలపై బీజెపీతో సహా వీహెచ్పీ, భజరంగ్ దళ్ వంటి హింధూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనల్లో ఇంత వరకూ పురోగతి లేదు. దోషులను గుర్తించి అరెస్టులు చేయలేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న తరుణంలో హింధూ భక్తుల మత విశ్వాసాలు దెబ్బతినేలా ప్రకాశం జిల్లాలో ఓ సంఘటన వెలుగు చూడటం పోలీసులకు సవాల్గా, బీజెపీ నేతలకు మరో అస్త్రంగా మారుతోంది.
విషయంలోకి వెళితే.. దర్శి పడమట బజారులో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు రక్తం చల్లి, మాంసపు ముక్కలు చల్లారు. ఆలయ గోడలకు రక్తంతో ముద్రలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వేసిన శిలాఫలకానికి రక్తం పూశారు. ఆలయ ప్రాంగణంలో జంతువును వధించారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆలయంలో ఇలా జరగడం అపచారం అంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను భయబ్రాంతులకు గురి చేసేందుకే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
ఇప్పటికే దర్శి నియోజకవర్గ వైసీపీలో వర్గవిబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వేసిన శిలా ఫలకానికి కూడా రక్తపు మరకలు అంటించడం చూస్తుంటే దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయనే అనుమానాలు కొందరు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.