రాయలసీమ జోన్ వర్చ్యువల్ ర్యాలీలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి జగన్ ప్రభుత్వం పై, ఘాటు విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ పరిపాలన పై కేంద్ర ప్రభుత్వ ఆలోచనాధోరణి ఇలాగ ఉందేమోనన్న కోణ౦లో కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయ పండితులు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పై కన్నేసిన బిజెపి జగన్ ప్రభుత్వం పై తమ పార్టీ అగ్ర నాయకుల చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తుందన అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇటీవల రాం మాధవ్ కూడా ఇదే విధంగా జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పై, మాట్లాడారు.
తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జగన్ ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు చేశారు “ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.వైఎస్ఆర్సిపీ అధికారంలోకి సంవత్సరం అయ్యింది, వైఎస్ఆర్సిపీ హయంలో, అహంకారం వచ్చింది, అసత్యాలతో జగన్ మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఇది మంచిది కాదు. హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న నాకు పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. “ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కష్టం, ఒక పార్టీలో చేరితే కష్టం, ఎలక్షన్ లో పాల్గుంటే కష్టం అనే ధోరణి మంచిది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వికేంద్రీకృతమైన అవినీతిని మనం చూస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టా రాజ్యంగా చేస్తున్నారు” అని కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు
“వైఎస్ఆర్సిపీ హయంలో మద్యం, ఇసుక మాఫియాలు ఎక్కడికక్కడ పురుడుపోసుకున్నాయి. వైఎస్ఆర్ పార్టీ జెండా నీడన, అనేక దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది” అని కిషన్ రెడ్డి సుతిమెత్తగా జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కిషన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు వెనక లోతైన రాజకీయమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు