ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సంక్షోభంతో పాటుగా,ఆర్థిక సంక్షోభం కూడా నెలకొంది.
ఈ సంక్షోభాల నుండి బయటపడడం కోసం ప్రపంచ దేశాలు పోటీపడి మరి కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి.రష్యా అప్పుడే తన కరోనా వ్యాక్సిన్ను మార్కెట్లో విడుదల చేసేసింది . ఇక భారతదేశం విషయానికి వస్తే దేశంలోనే ఫార్మా దిగ్గజం, తెలంగాణా రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ లో నిమగ్నమైంది.ఫార్మాస్యూటికల్స్ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆసుపత్రుల ఎంపిక చేసిన విషయం తెలిసిందే .
అందులో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి కూడా ఒకటి. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన భారత్ బయోటెక్ ఇప్పుడు రెండవ దశ ట్రయల్స్ ను ప్రారంభించింది. మొదటిదశలో టీకా వేయించుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ సక్సెస్ అయినట్లుగా ప్రకటించిన భారత్ బయోటెక్ , ఇప్పుడు రెండవ దశ ట్రయల్స్ ను ప్రారంభించింది.కొవ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ప్రయోగాలు నిమ్స్ లో ప్రారంభమయ్యాయి . మొదటి దశలో 50 మందికి ఈ ప్రయోగాలు చేయగా అవి విజయవంతమయ్యాయి.దీంతో రెండో బ్యాచ్ కి సోమవారం ప్రయోగాలు చేశారు .ముందుగా వారికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు రెండో బ్యాచ్ లో 50 మంది వాలంటీర్లను తీసుకోగా వారిలో కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల కు చెందిన పూర్వ విద్యార్థి ఎం.భూపాల్ రెడ్డి కూడా ఉన్నారు. భూపాల్ రెడ్డి ఐఆర్ఎస్ అధికారిగా పని చేశారు.
హైదరాబాదులో ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న మహాత్మా గాంధీ టెంపుల్ గౌరవ అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు.ఆయన భార్య సీత నరాల వైద్య నిపుణురాలు కాగా కుమారుడు రానా రెడ్డి ఎండీ జనరల్ మెడిసిన్ ఫైనలియర్ , కోడలు నిధి ఎమ్మెస్ గైనకాలజీ రెండో సంవత్సరం ,కుమార్తె డాక్టర్ వీణ ఎండి జనరల్ మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.కరోనా టీకా క్లినికల్ ట్రైల్స్ లో పాల్గొనడం ద్వారా భూపాల్ రెడ్డి కూడా వైద్య రంగానికి తన సేవలందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం తమను డిశ్చార్జి చేశారని, ఈ టీకా ప్రయోగంలో తమకేమి ఇబ్బంది కలగలేదని భూపాల్ రెడ్డి తెలిపారు. పద్నాలుగు రోజుల తరువాత మళ్లీ రెండో డోస్ ఇస్తారని ఆయన వివరించారు .దేశానికి ఉపకరించే టీకా క్లినికల్ ప్రయోగాల్లో తను భాగస్వామి కావడం పట్ల భూపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా రెండో దశ ప్రయోగాలకు హాజరైన వారిని పరీక్షల నిర్వాహకుడు నారాయణరెడ్డి అభినందించారు