రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉచిత రేషన్ (బియ్యం, గోధుమలు) పంపిణీకి సంబంధించి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) పథకాన్ని మరో ఏడాది పాటు అంటే 2023 వరకూ పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కార్డుదారుల్లో ఒక్కొక్కరి అయిదు కేజీల బియ్యం లేదా అయిదు కేజీల గోధుమలను పంపిణీ చేయనున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమలను, దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకూ విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆహార మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
ప్రస్తుత పొడిగింపు నిర్ణయంతో ఎన్ఏఫ్ఎస్ఏ కార్డుదారులకు ప్రయోజనం కలుగుతుంది. కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలో దేశం లో 2020 ఏప్రిల్ నుండి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం తర్వాత పథకాన్ని పొడిగించింది. ప్రస్తుతం ఈ పథకం కింద బియ్యం ఉచిత పంపిణీ కొనసాగుతుండగా, 2023 డిసెంబర్ వరకూ ఉచిత రేషన్ పొడిగించింది కేంద్రం. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 81,35 కోట్ల మందికి లబ్దిచేకూరనుంది. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడనుంది.
ఇంతకు ముందు ఏపి ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులతో పాటు రాష్ట్ర కార్డులకు కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయగా, గత మూడు నెలల నుండి రాష్ట్ర కార్డులకు ఉచిత బియ్యం పంపిణీ నిలుపుదల చేసింది. కేవలం కేంద్రం ఇచ్చే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం సరఫరా చేస్తొంది.