పంజాబ్ లోని ఓ యూనివర్శిటీ లో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. మోహాలీలో ఉన్న చండీగడ్ యూనివర్శిటీ విద్యార్ధినుల ఆందోళనతో అట్టుడికిపోయింది. తమ ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వర్శిటీ హాస్టల్ విద్యార్ధినులు శనివారం రాత్రి నుండి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. హాస్టల్ లో ఉంటున్న ఓ విద్యార్ధిని .. ఇతర విద్యార్ధినులు బాత్ రూమ్ లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి తన స్నేహితుడికి పంపగా, అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తమ ప్రైవేటు వీడియోలు లీక్ కావడంతో విద్యార్ధినులు ఆందోళనకు గురైయ్యారు.
ఈ ఘటనతో మనస్థాపానికి గురైన ఎనిమిది మంది విద్యార్ధినులు ఆత్మహత్యయత్నంకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే విద్యార్ధినులు ఎవరూ ఆత్మహత్యాయత్నంకు పాల్పడలేదని పోలీసులు, యూనివర్శిటీ అధికారులు పేర్కొంటున్నారు. వీడియోల వ్యవహారం బయటకు రాగానే ఓ యువతి అస్వస్థతకు గురైందని, ప్రస్తుతం ఆ విద్యార్ధిని ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీఎస్పీ రూపిందర్ కౌర్ తెలిపారు. ఓ నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, సెల్ ఫోన్ ను సీజ్ చేసి ఫొరెన్సిక్ కు పంపినట్లు తెలిపారు. దోషులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని విద్యార్ధినులు ఆందోళన విరమించాలని కోరారు. ఎవరూ ఆత్మహత్యాయత్నంకు పాల్పడలేదని సీనియర్ సూపర్నిటెండెంట్ ఆఫ్ పోలీసు వివేక్ సోనీ తెలిపారు. వదంతులు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్దోత్ సింగ్ బైన్స్ స్పందించారు. వర్శిటీ విద్యార్ధినులు శాంతియుతంగా ఉండాలని కోరారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని, మన అక్కా చెల్లెళ్లు, కూతుళ్ల గౌరవానికి సంబంధించినదని సంయమనం పాటించాలని సూచించారు. మీడియాతో పాటు ప్రజలందరూ ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ ఘటనపై పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టి సారించింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నిందితులకు కఠనంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని విద్యార్ధినుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.