ఓ వైపు ఏపీలో ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. అటు చూస్తే వైసీపీ ఇప్పటికే ఆరేడు జాబితాల్లో టిక్కెట్లు ప్రకటిస్తూ దూసుకుపోతోంది. చంద్రబాబు తమకు 30 నుంచి 40 సీట్ల లోపు అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తారని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన జన సైనికుల ఆశలపై ఈ రోజు ప్రెస్మీట్ సాక్షిగా ఆయన నీళ్లు చల్లినట్లయ్యింది. చంద్రబాబు పక్కనే పవన్, నాగబాబును పెట్టుకుని జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుందని చెప్పిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో పాటు జనసేన తరపున పోటీ చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్న నాయకుల ఆశలు ఒక్కసారిగా నీరు గారిపోయాయి.
చంద్రబాబు అంటేనే ఎంత రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రాజకీయ చాణక్యం దెబ్బతో ఎంతోమంది మహామహులే చిత్తైపోయారు. పవన్ లాంటి రాజకీయ పరిపక్వత, రాజకీయ అనుభవం లేని.. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని పవన్ ఎందుకు సరితూగుతాడు.. అసలు చంద్రబాబు మంత్రాంగాన్ని పవన్ ఎంత వరకు ఎదుర్కొంటాడు. చంద్రబాబు వేసిన ఎత్తు దెబ్బకు పవన్ ఒక్కసారి కాదు రెండు సార్లు చిత్తైపోయాడని జనసేన ఫ్యాన్సే గగ్గోలు పెడుతున్నారు.
ఇక చంద్రబాబు తాను పోటీ చేసే సీటుతో పాటు తన కొడుకు, వియ్యంకుడు పోటీ చేసే సీటును కూడా ఎనౌన్స్ చేశారు. పవన్ పార్టీ మొత్తం 24 సీట్లలో పోటీ చేస్తుందని చెపితే అందులో కేవలం 5 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అందులో పవన్ పోటీ చేసే సీటు కూడా లేదు. ఇక జనసేన పోటీ చేసే మిగిలిన 19 సీట్లలోనూ కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక పవన్ తన మంత్రాంగం ప్రదర్శించబోతున్నాడని అంటున్నారు.
టీడీపీ నుంచి సీట్లు రాని కొందరు టాప్ లీడర్లను తానే జనసేనలోకి పంపి.. ఆ పార్టీ తరపున బీ ఫామ్లు ఇప్పించి గెలిపించేలా మంత్రాంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో బీజేపీలోనూ చంద్రబాబు ఇదే టెక్నిక్ ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా కామినేని శ్రీనివాస్తో పాటు ఒకరిద్దరు టీడీపీ నేతలను తానే జనసేనలోకి పంపి ఆ పార్టీ తరపున బీఫామ్లు వచ్చేలా చక్రం తిప్పుతున్నారని.. ఓవరాల్గా బాబు పన్నిన రాజకీయ వ్యూహంలో పవన్ ఇరుక్కుపోయారని అంటున్నారు.