CM YS Jagan: ప్రభుత్వ పరిపాలనలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రజలకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను చేరువ చేసిన ప్రభుత్వం..సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏపి సేవ పోర్టల్ ను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు.
CM YS Jagan: అన్ని సేవలు ఆన్ లైన్ ద్వారా పొందేందుకు..
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు పోర్టల్ ను తీసుకొచ్చామని చెప్పారు. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ను ఏపి సేవా పేరుతో పోర్టల్ ప్రారంభిస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం వేగంగా, పారదర్శకంగా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలు పొందేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. మనకు ఉన్న వ్యవస్థను మెరుగుపర్చుకునే క్రమంలో ఇదొక ముందడుగని సీఎం జగన్ తెలిపారు. డాక్యుమెంట్ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదని సీఎం జగన్ చెప్పారు. దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తుందన్నారు. ఆన్ లైన్ లోనే దరఖాస్తులు ఆమోదించే అవకాశం ఉంటుందని తెలిపారు.
రెండేళ్లలో 3.47 కోట్ల మందికి సచివాలయాల ద్వారా సేవలు
ఈ పోర్టల్ ద్వారా ఏ అధికారి వద్ద తమ ఫైల్ ఉంది అనేది లబ్దిదారుడికి తెలుస్తుందనీ, ఉద్యోగుల జవాబుదారీతనం మరింత పెరుగుతుందని తెలిపారు. గ్రామ స్వరాజ్యం అంటే గడచిన ఈ రెండేళ్ల కాలంలో అందరికీ తెలిసేలా గత రెండేళ్ల కాలంలో అడుగులు ముందుకేశామని జగన్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయని తెలిపారు. దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఈ డెలివరీ మెకానిజంలో పని చేస్తున్నారన్నారు. 2020 జనవరి 26 నుండి ఇప్పటి వరకూ గ్రామ సచివాలయాల ద్వారా 3.47 కోట్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాయని సీఎం జగన్ తెలిపారు.