గుంటూరు: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దశలవారీగా ఆర్టిసిలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఆర్టిసిలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామని జగన్ తెలిపారు.
పర్యావరణ రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ వనమహోత్సవంలో భాగంగా రాష్ట్రంలో 25కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జగన్ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు గానూ మూడు నుండి నాలుగు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జగన్ కోరారు. చెట్లు చేసే మేలును జగన్ వివరించారు. రోడ్లకు ఇరు వైపులా చెట్లు నాటించడం వల్లనే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యారని జగన్ గుర్తు చేశారు.
పారిశ్రామిక అభివృద్ధి కాలుష్య రహితంగా ముందుకు వెళ్లేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు జగన్ చెప్పారు.
కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.