(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అసోంలో నేడు ప్రకటించిన ఎన్ఆర్సీ తుది జాబితాలో భారత మాజీ ఆర్మీ అధికారి మహ్మద్ సనావుల్లా పేరు దక్కలేదు. తుది జాబితాలో మొత్తం 3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తాజా లిస్ట్ లోనూ సనావుల్లాతోపాటు ఆయన ముగ్గురు పిలల్ల పేర్లు కూడా లేవు. అయితే సనానవుల్లా భార్య పేరుతో మాత్రం ఫైనల్ లిస్ట్ లో ఉంది.
సనావుల్లా మూడు దశాబ్దాలు ఇండియన్ ఆర్మీలో పని చేశారు. 1987లో భారత సైన్యంలో చేరిన సనావుల్లా…2017లో పదవీ విరమణ పొందారు. కశ్మీర్, మణిపుర్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులతో పోరాడారు. తర్వాత అసోం బోర్డర్ పోలీసు విభాగంలో ఎస్ఐగా కూడా చేశారు. కార్గిల్ యుద్ధ వీరుడైన ఈయనను అసోంకు చెందిన ఓ ట్రైబ్యునల్ విదేశీయుడనే ముద్ర వేసింది. ట్రిబ్యునల్లో సనావుల్లా తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఆయనను విదేశీయునిగా పరిగణిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ అధికారి చాంద్రమాల్ దాస్ ఇచ్చిన రిపోర్ట్ ఆదారంగా సనావుల్లాను విదేశీయుడిగా ప్రకటించారు. సనావుల్లాను విదేశీయుడిగా నిర్ధారించిన ట్రిబ్యునల్ తీర్పుపై సనావుల్లా కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం గౌహతి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ననావుల్లా FT ద్వారా విదేశీయుడిగా ప్రకటించబడ్డారు. ఈ నేపథ్యంలోనే సనావుల్లాతోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు, కుమారుడి పేర్లు ఫైనల్ లిస్ట్ లో రాలేదని తెలుస్తోంది.