అమరావతి: విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వినయ్చంద్, ఇతర అధికారులు హజరుకాగా తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై సిఎం జగన్ చర్చించారు.
విశాఖలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ మెట్రోపైనా జగన్ సమీక్షించారు. నగరంలోని అన్ని రోడ్లను బాగు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్లాన్ తయారు చేస్తున్నామని అధికారులు విరించారు. బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, విశాఖ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన తదితర విషయాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.