హైదరాబాదు, ఏప్రిల్ 25: తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై గురువారం కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో హైదరాబాదులో, సిఎల్పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నేతల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కొనసాగించారు. ఆందోళన నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్లు కలెక్టరేట్ కార్యాలయం వద్ద లోపలకు చొచ్చుకుని వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీనటి విజయశాంతి, నాయకులు నాయని నర్సింహరెడ్డి, కొండా సురేఖ తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చి ఐదు రోజులు గడుస్తున్నా దొర (కెసిఆర్) మాత్రం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. 20మంది విద్యార్థులు చనిపోయినా ఆయనలో చలనం లేదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు.