గుంటూరు: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షాకి కేంద్ర హోంశాఖ మంత్రి పదవి ఇవ్వడంపై సిపిఐ జాతీయ నేత నారాయణ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ దాదాపు 12మందిని అమిత్షా ఎన్కౌంటర్ల ద్వారా చంపించారని నారాయణ ఆరోపించారు. ఈ వ్యవహానికి సంబంధించి ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులూ ఉన్నాయని నారాయణ పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిని భారత హోంమంత్రిగా నియమించడం నిజంగా దురదృష్టకరమని నారాయణ విమర్శించారు.
అమిత్షాతో పాటు 26మంది బిజెపి నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంటూ వీళ్లా దేశాన్ని పాలించేది అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్లో 52మంది మంత్రులు కోటేశ్వరులేనని నారాయణ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇవిఎంలను వాడటం లేదనీ, మన దేశంలోనూ వీటిని తొలగించి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు.