అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఎఎస్లను బదిలీ చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తాజాగా ఐపిఎస్ల బదిలీలపై దృష్టి సారించింది.
పోలీస్ శాఖలోని వివిధ అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో డిజిపి గౌతమ్ సవాంగ్ నేడు బేటీ అయ్యారు. జిల్లా ఎస్పిలు, కమిషనర్ స్థాయి వరకూ బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బదిలీలకు సంబంధించి ఇప్పటికే డిజిపి సవాంగ్ ఒక నివేదికను తయారు చేసినట్లు సమాచారం. ఈ బేటీలో ఈ నివేదికను సిఎం జగన్కు అందజేశారు. నేడో రేపో బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
నిన్న ఒకే రోజు 45మంది కీలక అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వారిలో 36మంది ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు. తొమ్మిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. గత ప్రభుత్వ హయాంలో లూప్లైన్లో ఉన్న పలువురు అధికారులకు ప్రాధాన్యత గల పోస్టింగ్లు లభించాయి.
పోలీసులకు వీక్లీ ఆఫ్లపై కూడా సిఎం జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిజిపితో భేటీలో ఈ అంశం కూడా చర్చించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా పోలీసులకు వీక్లీ ఆఫ్కు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సిఎం జగన్ సూచించారు. దీని కోసం డిజిపి సవాంగ్ ఒక అధ్యయన కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. ఈ కమిటికి 21మంది పోలీసు అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. వీక్లీ ఆఫ్ అమలుపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.