అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కష్టకాలం మొదలవుతున్నదా? అధికారపక్షం పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రోజువారీ ట్వీట్లు చూసినా, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ చూసినా ఈ అనుమానం రాకమానదు.
గత అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏలుబడిలో చాలా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై వెంటనే విచారణ జరిపించాల్సిందిగా కన్నా ముఖ్యమంత్రిని కోరారు. అమరావతి భూ సేకరణలో చాలా అక్రమాలు జరిగాయనీ, అస్సైన్డ్ భూముల కోనుగోలు అక్రమాలు చోటు చేసుకున్నాయనీ ఆయన ఆరోపించారు. ఇసుక వ్యాపారం మాఫియామయం అయిపోయిందని కన్నా ఆరోపించారు.
చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారన్నది బహిరంగ రహస్యం. ఇక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే జగన్ కుడిభుజం ఆయన. గత అయిదేళ్లుగా రాష్ట్రంలో టిడిపి, వైసిపి మధ్య రాజకీయవైరం తీవ్రస్థాయిలో నడిచింది. చంద్రబాబు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని జగన్ ఆరోపిస్తూవచ్చారు.
ఎ వన్, ఎ టులా నాపై అవినీతి ఆరోపణలు చేసేది అంటూ జగన్, విజయసాయి రెడ్డిపై ఉన్న కేసులు ప్రసావిస్తూ చంద్రబాబు హేళన చేశారు. జగన్పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన దరిమిలా వైసిపిని చంద్రబాబు కోడికత్తి పార్టీ అనడం మొదలుపెట్టారు. అలాగే చంద్రబాబుపై కూడా వైసిపి నేతలు సబబు కాని రీతిలో విమర్శలు చేస్తూ వచ్చారు. స్వయంగా జగన్, చంద్రబాబును ఉరితీయాలా వద్దా అన్నారు. మొత్తం మీద ప్రజాక్షేత్రంలో రాజకీయ సంవాదం స్థాయి చాలా దిగజారింది. దీనికి ఇరుపక్షాలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అటూఇటూ ఆరోపణల్లో ఎంతమేరకు వాస్తవాలు ఉన్నాయన్నదానితో నిమిత్తం లేకుండా వ్యక్తిగత ఆరోపణలు మనసులో చేదును మిగుల్చుతాయి. ఎ1, ఎ2 అన్న చంద్రబాబు హేళనను విజయసాయిరెడ్డి అంత తేలికగా మరచిపోతారా? మరచిపోరు అన్న విషయం ఆయన ట్వీట్లు చూస్తేనే అర్ధం అవుతుంది.
అటు బిజెపికీ, ఇటు వైసిపికీ కూడా చంద్రబాబు నాయడు ఉమ్మడి శత్రువు కాబట్టి గత అయిదేళ్ల టిడిపి పాలనను తవ్వితీసి ఏమాత్రం అవకాశం దొరికినా చంద్రబాబును ఇబ్బంది పెట్టకుండా ఉండరు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఆ దిశగా కార్యాచరణకు నాంది అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.