అమరావతి: విజయవాడ ఎంపి కేశినేన శ్రీనివాస్ (నాని) అసంతృప్తి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో దాన్ని పరిష్కరించేందుకు స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.
పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ కేశినేని నాని పెట్టిన ఫేస్బుక్ పోస్టింగ్ తీవ్ర సంచలనం కల్గించింది. పార్టీలో ఎంతో మంది సినియర్లు ఉన్నారనీ, అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ వ్యగ్యంగా పేర్కొనడం ఆయన పార్టీపై అలకవహించినట్లు కనబడుతోంది.
గల్లా జయదేవ్ను పార్లమెంటరీ పార్టీ నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్సభాపక్ష నేతగా నియమించిన చంద్రబాబు కేశినేనికి లోక్సభలో పార్టీ ఉపనేత, విప్ పదవి కట్టబెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుండి ఈ ముగ్గురు మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కేశినేని అలకవహించారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపి గల్లా జయదేవ్ను కేశినేని వద్దకు చంద్రబాబు పంపారు. పార్టీ మారే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని కేశినేని స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ విప్ పదవి స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
కేశినేని అలకకు పార్లమెంటరీ పదవే కారణమని ప్రచారం జరుగుతున్నప్పటికీ మరి కొన్ని కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రవాణ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో నాడు చంద్రబాబు సూచనల మేరకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు క్షమాపణలు చెప్పారు. ఆ పరిణామ క్రమంలో ఆయన రాష్ట్రంలో కేశినేని ట్రావెల్స్ బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తొలి నుండి నిర్మోహమాటంగా మాట్లాడే మనస్థత్వం ఉన్న కేశినేని పార్టీ అంతర్గత సమావేశాల్లో చేసిన సూచనలను సైతం నాయకత్వం పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల కూడా అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవించి అధికార పక్షానికి కొంత సమయం ఇవ్వాలని కూడా కేశినేని సూచించినట్లు సమాచారం. గల్లా అరుణ పార్టీ పోలిట్ బ్యూరోలో ఉండగా అదే కుటుంబానికి చెందిన గల్లా జయదేవ్కు పార్లమెంటరీ పార్టీ నేతగా పదవి ఇవ్వడం ఆయనకు నచ్చలేదని అనుకుంటున్నారు. పార్టీ పదవుల కేటాయింపులో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు సభ్యుల అభిప్రాయం అడగడం దండగ అనేది కేశినేని భావనగా తెలుస్తోంది.
చంద్రబాబు సూచనల మేరకు గల్లా జయదేవ్ నేరుగా కేశినేని ఇంటికి వెళ్లి చర్చించినప్పటికీ చర్చలు ఫలప్రదం కాలేదని తెలుస్తోంది. విషయం మరింత ముదురుతుండటంతో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు కేశినేనికి ఫోన్ చేసి సాయంత్రం తన ఇంటికి రావాల్సిందిగా ఆదేశించారు. సాయంత్రం నానితో చర్చించనున్నారు.