అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలు గాడిలో పడ్డారు. శాసనసభ ఎన్నికలలో పరాభవం లాంటి పరాజయం తర్వాత టిడిపి భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని మరెవరికైనా అప్పగిస్తారా అన్న మీమాంస మీడియాలో తలెత్తింది.
69 ఏళ్ల చంద్రబాబు వయసును దృష్టిలో ఉంచుకుని ఆయన ఇంత పెద్ద పరాభవాన్ని తట్టుకుని నిలబడగలరా, పార్టీని నడపగలరా వంటి ప్రశ్నలపై చర్చ జరిగింది. తాను కాకపోతే మరి లోకేష్కు పార్టీ నాయకత్వం ఇస్తారా అన్న ప్రశ్న కూడా వచ్చింది. ఈ ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు టిడిఎల్పి సమావేశం రోజునే సమాధానం ఇచ్చారు. తాను ఎక్కడికీ పోబోవడం లేదనీ, పార్టీని తానే నడుపుతాననీ అంటూ ఆయన టిడిఎల్పి నాయకత్వం బాధ్యత స్వీకరించారు.
తాజాగా చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డికి ఒక లేఖ రాశారు. అమరావతిలో తాను ఉంటున్న ఇంటిపక్క ప్రజావేదికను తనకు కేటాయించాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను కలుసుకునేందుకు తనకు ప్రజావేదిక ఉపయోగపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
చంగ్రబాబు ఇప్పుడు ఉంటున్న నివాసగృహం విజయవాడకు చెందిన లింగమనేని రమేష్ది. హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మారుద్దామని చంద్రబాబు నిర్ణయించిన తర్వాత ఆయన నివాసానికి అనువైన గృహంగా దీనిని గుర్తించారు. యాజమాన్యం షరతులకు లోబడి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నట్లు ఆయన జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను అందులోనే కొనసాగదలచుకున్నానని కూడా చంద్రబాబు తెలిపారు.
ఇప్పుడు ప్రశ్న ప్రజావేదికను చంద్రబాబుకు కేటాయిస్తారా లేదా అన్నది కాదు. అసలు చంద్రబాబును ఆ ఇంటిలో ఉండనిస్తారా లేదా అన్నదే. నిన్న కాక మొన్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ ప్రాంతంలో కృష్ణానది కరకట్ట పక్కనున్న కట్టడాలను సందర్శించారు. ప్రభుత్వం అండ చూసుకుని అక్రమ కట్టడాలు నిర్మించారని ఆయన టిడిపి నాయకులపై ధ్వజమెత్తారు,. నిజానికి అక్కడ నడి ఒడ్డున నిర్మించిన కట్టడాలన్నీ అక్రమ కట్టడాలే. నిబంధనల ప్రకారం అవి అక్కడ ఉండడానికి వీల్లేదు.
జగన్ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలను తుచతప్పకుండా అమలు చేసి ఆ కట్టడాలను అక్రమమైనవిగా గుర్తిస్తే చంద్రబాబు కూడా వేరే నివాసం చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రజావేదికను కేటాయించడమన్న ప్రస్తావనే రాదు. అలాకాకుండా జగన్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తే చంద్రబాబుకు ప్రజావేదిక కేటాయించాలా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య సమీకరణలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి సూచికగా భావించవచ్చు.