YSRCP: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు వైసీపీ ఇన్ చార్జి విరూపాక్ష మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
గుమ్మనూరు జయరాం స్థానంలో వైసీపీ హైకమాండ్ విరుపాక్షను ఇటీవల నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో విరూపాక్ష వైసీపీ శ్రేణులతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే విరూపాక్షను ఇన్ చార్జిగా నియమించిన నాటి నుండి పార్టీ కార్యక్రమాలకు గుమ్మనూరు జయరాం దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో హళకుంద నుంచి మార్లమాడి రహదారి నిర్మాణానికి వైసీపీ ఇన్ చార్జి భూమిపూజ చేశారు.
గతంలో మంజూరైన రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో విరూపాక్ష కాంట్రాక్టర్ ను ఒప్పించి రహదారి పనులను పూర్తి చేసేందుకు భూమి పూజ చేశారు. ఈ పరిణామం గుమ్మనూరుకు ఆగ్రహం తెప్పించింది. ఆలూరుకు తాను ఎమ్మెల్యేగా ఉండగా విరూపాక్ష భూమి పూజ చేయడం ఏమిటి.. తానే ఆ రోడ్డుకు భూమి పూజ చేస్తానంటూ బయలుదేరారు.
ఓ పక్క విరూపాక్ష వర్గీయులు, మరో పక్క గుమ్మనూరు వర్గీయులు చేరుకోవడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Medaram: మేడారం మహా జాతర ప్రత్యేక పూజలు ప్రారంభం ..తరలివస్తున్న భక్తజనం