ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సుఖేశ్ గుప్తాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను సీసీఎస్ నుండి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయనను అక్కడ నుండి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు హజరుపర్చనున్నారు. రెండు రోజుల పాటు ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో ముసద్దిలాల్ జ్యూవెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా బంగారం వ్యాపారం చేస్తూ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. గుప్తాకు చెందిన సంస్థల్లో వందల కోట్ల బంగారు అభరణాలు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. గత మూడేళ్లుగా గుప్తా అనేక చిరునామాలతో తప్పించుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం సుఖేశ్ గుప్తా అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
విదేశాల నుండి అక్రమ మార్గంలో బంగారం స్మగ్లింగ్, గోల్డ్ ఎక్స్ పోర్టు, బ్యాంకుల నుండి రుణాల ఎగవేత, పెద్ద నోట్ల రద్దు సమయంలో నకిలీ పత్రాలు సృష్టించి బంగారం విక్రయించి మోసాలకు పాల్పడటం వంటి అభియోగాలు గుప్తాపై ఉన్నాయి. అంతే కాకుండా ఎంఎంటీసీ నుండి పొందిన గోల్డ్ క్రిడిటె్ కు ఎటువంటి పన్ను చెల్లించలేదని సమాచారం. ఈ అభియోగాల నేపథ్యంలో సుఖేశ్ గుప్తా పై ఈడీ మూడు నేరాల కింద కేసు నమోదు చేసింది. అయితే తాను రూ.,110 కోట్లు రుణం తీసుకుని దానికి గానూ రూ.130 కోట్లు చెల్లించాననీ, అయినా తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు సుఖేశ్ గుప్తా పేర్కొంటున్నారు. బంగారం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై 2013లోనే సుఖేశ్ గుప్తాతో పాటు ఆతని సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. భారీ ఎత్తున లాభాలు గడించి వ్యక్తిగత ఆస్తులను సమకూర్చుకున్నట్లు గుర్తించిన సీబీఐ 2014లోనే చార్జిషీటు దాఖలు చేసింది.
ఆ క్రమంలోనే మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ .. ఎంబీఎస్ జ్యూయెలర్స్, ఎంబీఎస్ ఇంప్లెక్స్ సంస్థల నిర్వహకులు సుఖేశ్ గుప్తా, అనురా గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తాకు చెందిన రూ.365.51 కోట్ల విలువైన 45 స్థిర చరాస్తులను గత ఏడాది ఆగస్టులో జప్తు చేసింది. ఈడీ దర్యాప్తునకు నిందితులు సహకరించకపోవడమే కాకుండా తగిన అధారాలు సమర్పించడంలో విఫలమయ్యారు. ఫెమా కింద నమోదు చేసిన మరో కేసులో ఈడీ రూ.222 కోట్ల జరిమానా విధించింది. ఆ సొమ్మును చెల్లించేందుకు నిర్వహకులు 2019లో ఒన్ టైమ్ సెటిల్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నా ఆ నిధులు జమ చేయలేదు. ఈ నేపథ్యంలో మరో సారి దృష్టి సారించిన ఈడీ.. రెండు రోజుల పాటు సోదాలు జరిపిన వంద కోట్ల విలువైన బంగారంతో పాటు వజ్రాలతో తయారు చేసిన అభరణాలు,. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని ఆయన్ను అరెస్టు చేసింది.