నల్గొండ: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
బండి సంజయ్తో పాటు ఆయనతో ఉన్న నేతలంతా భౌతిక దూరం పాటించకుండానే పర్యటన కొనసాగించారని నల్గొండ పోలీసులు తెలిపారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా సోషల్ డిస్టెన్సింగ్ లక్ష్యం దెబ్బతినేలా వ్యవహరించారని బండి సంజయ్తో పాటు మిగతా నేతలపై 188వ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు.
ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షల ప్రకారం భారీ సంఖ్యలో ప్రజలు ఒక్క చోట గుమికూడటం, సమావేశాలు నిర్వహించడం వంటి పనులు చేయకూడదు.