2020 సంవత్సరం అంతా తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా సాగింది.సంస్కరణలు తెస్తున్నానంటూ గొప్పగా చెప్పుకొని చేసిన కొత్త చట్టాల ప్రయోగం ఫెయిల్ అయింది. అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలు వివాదస్పదం కావడమే కాదు, ప్రజలకు లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే గత ఏడాది అంతా సీఎం కేసీఆర్ పాలన ప్రజలకు అసంతృప్తినే మిగిల్చింది. అందుకే దుబ్బాక బై ఎలక్షన్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలొచ్చాయి.ఇది గమనించి చివరకు వాటిపై కేసీఆర్ సర్కారు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. .
అనాలోచిత నిర్ణయాలకు నిరసనల సెగ!
అవినీతిని అంతం చేస్తామంటూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చింది కేసీఆర్ సర్కారు. అసెంబ్లీలో సమగ్ర చర్చ లేకుండా.. విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ఆమోదించిన చట్టం పెద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో ఆల్టర్నేటివ్ ను చూపించకపోవడంతో భూవివాదాలు పెరిగిపోయాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల కోసం రూపొందించిన ధరణి పోర్టల్ మరింత వివాదస్పదమైంది. మూడు నెలల పాటు రిజిస్టేషన్లు నిలిపి వేసినా కొత్త విధానం సక్సెస్ కాలేదు. హైకోర్టు ఆంక్షితలు, ప్రజల ఒత్తిడికి తలొగ్గి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వం 2020లో చేసిన అతి పెద్ద పొరబాటు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్). ప్రతి ఇంటి స్థలానికి ఎల్ఆర్ఎస్ ఉండాల్సిందేనంటూ చేపట్టిన అనాలోచిత చర్య ప్రజలకు శాపంగా మారింది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పటి మార్కెట్ ధరకు అనుగుణంగా సర్కారు నిర్ణయించిన అమౌంట్ కట్టాల్సి రావడంతో ప్రజలు భగ్గుమన్నారు. రిజిస్ట్రర్ అయిన భూమిని కూడా అనధికార, అక్రమ భూమి అనడంతో ఓనర్లు తల్లడిల్లిపోయారు. ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎల్ఆర్ఎస్ తెచ్చిందని , దాన్ని రద్దు చేయాలని నిరసనలకు దిగే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దీనికీతలొగ్గక తప్పలేదు
నియంత్రిత సాగుకీ నీళ్లు
కేసీఆర్ 2020లో తన అనాలోచిత నిర్ణయాలతో రైతులను ఆగం చేశారు. నియంత్రిత సాగు పేరుతో రైతులకు ఏ పంట వేయాలన్నది సర్కారు డిక్టేట్ చేయాలన్న విధానం పూర్తిగా ఫెయిల్ అయింది. చివరకు ఈ విషయంలో కూడా కెసిఆర్ సర్కార్ తుది నిర్ణయాన్ని రైతు చాయిస్ కే వదిలేసింది
ఎన్నికల హామీలు గాలికి !
మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలును సీఎం కేసీఆర్ మొత్తంగా గాలికొదిలేశారు. ఉద్యోగాల భర్తీని అస్సలు పట్టించుకోలేదు. కొలువులొచ్చే వరకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇంత వరకు అడ్రస్ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో చెప్పలేనంత నిర్లక్ష్యం ప్రదర్శించింది. లక్ష ఇండ్లు లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పి, గ్రేటర్ ఎన్నికల ముందు ప్రచార ఆర్బాటం చేయడం మినహా ఫలితం శూన్యం.