ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
గత కొన్ని రోజులుగా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.620మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.మూడు మరణాలు కూడా సంభవించాయి.దీనిపై ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలు అంటూ రకరకాల కథనాలు కూడా వ్యాప్తిలో కొచ్చాయి.నీరు కలుషితమైందని ,కూరగాయల లో మితిమీరి వాడిన రసాయనాలు ఈపరిస్థితి తెచ్చాయని చానెళ్లు మోత మోగించాయి.ఈ పరిస్థితుల్లో అసలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలేమిటన్న విషయాన్ని కనిపెట్టే బాధ్యతను న్యూఢిల్లీ ఎయిమ్స్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సీఎం జగన్ అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందచేయనున్నారు.
అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపించిందనే దానిపై ఢిల్లీ ఏయిమ్స్ ప్రతినిధులు శాంపిల్స్ సేకరించారు. దీనిపై అధ్యయనం చేశారు.ఈ క్రమంలో…బుధవారం సీఎం జగన్ వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనుషుల శరీరాల్లోకి పురుగుమందులు ప్రవేశించాయని వారు జగన్ కి తేల్చి చెప్పారు.అంతేగాక ఈ విషయమై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు వెల్లడించారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలన్న సీఎం జగన్ సూచించారు. ప్రతి జిల్లాలో కూడా ల్యాబులు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్కు ముఖ్యమంత్రి సూచించారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆర్బీకేల ద్వారా సేంద్రీయ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ తెలిపారు.ఈ విషయమై రైతులకు, అదే సమయంలో ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కూడా జగన్ ప్రభుత్వం భావిస్తోంది.అక్కడక్కడా ఏలూరు లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై కూడా సీఎం ఆరా తీశారు.ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆయా జిల్లాల అధికారులను జగన్ ఆదేశించారు.