హైదరాబాద్: సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘సకల జనుల సమరభేరీ’ సభకు ఆటంకాలు తొలగాయి. కొన్ని షరతులతో సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకుముందు సభకు ఎందుకు అనుమతివ్వలేదంటూ ప్రభుత్వాన్ని మందలించింది. సరూర్ నగర్ మైదానంలోసభకు నిర్వహించుకుంటామని కార్మిక సంఘాలు కోరగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సంఘాలు హైకోర్టు ఆశ్రయించాయి. మంగళవారం మధ్యాహ్నం కోర్టు విచారణ జరిపింది. తర్వాత ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుని సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు సభ జరుపుకోవాలని సూచించింది. అయితే సాయంత్రం 6 గంటల వరకు సభను నిర్వహిస్తామని కార్మిక సంఘాలు కోర్టుకు తెలిపాయి. దీనికి అంగీకరించని కోర్టు సాయంత్రం 5 గంటలకల్లా సభ ముగించాలని ఆదేశించింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం 21 డిమాండ్లపై చర్చలకు సిద్దం కాగా.. కార్మిక నేతలు మాత్రం మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాలని పట్టుబడ్డారు. నేతల డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. ఇద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతోంది. రోజుకో నిరసన కార్యక్రమం చేపడుతున్న కార్మికులు.. బుధవారం సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి మంచిది కాదని సూచిస్తున్నారు.