ఏపీ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ గురించి మాట్లాడాల్సిందే. ఏపీకి వైఎస్ జగన్ ఒక ఐకాన్ అయిపోయారు. 2019 ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో తిరుగులేని పార్టీగా అవతరించింది. టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించింది. బీజేపీ, జనసేన, ఇతర చోటామోటా పార్టీలైతే జాడ లేకుండా పోయాయి. 151 సీట్లతో జగన్ ప్రభుత్వం కొలువు దీరింది.
అయితే.. 2019 ఎన్నికల్లో జగన్ కు వచ్చిన విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు. దాదాపు తొమ్మిదేళ్ల కష్టం అది. తొమ్మిదేళ ప్రతిఫలం అది. పార్టీ పెట్టినప్పటి నుంచి గెలుపు తీరాలను తాకేవరకు పార్టీ ఉనికిని పోకుండా కాపాడటంలో జగన్ సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు.
2019 ఎన్నికల ముందు ఆయన చేసిన పాదయాత్ర బాగా కలిసివచ్చింది. ప్రజల నమ్మకాన్ని గెలిచారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. గెలవగానే ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని జగన్ తపించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ ఏపీలో అమలు చేశారు.
గత ముఖ్యమంత్రి కోట్ల అప్పులు చేసి వెళ్లినా.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా అవేమీ లెక్క చేయకుండా… వైఎస్ జగన్.. ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. మొత్తానికి డైనమిక్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు.
అంతవరకు బాగానే ఉంది కానీ.. కొన్ని విషయాల్లోనే జగన్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అవినీతిపై ఉక్కు పాదం మోపాలని జగన్ ప్రయత్నించారు. అందుకేప. వెంటనే ఇసుక రీచ్ లను రద్దు చేశారు. దీంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రత పెరిగింది. ఇంతలోనే వర్షాలు, వరదలు రావడంతో ఇసుక కొరత జగన్ కు మైనస్ పాయింట్ అయింది.
అంతే కాదు.. కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం, వేధింపులు చేయడం, అక్రమ కేసులు, అవినీతి వ్యవహారాల్లో జోక్యాలు.. ఇవన్నీ జగన్ కు చెడ్డ పేరునే తీసుకొస్తున్నాయి. అయితే.. జగన్ చేసిన ఎన్నో మంచి పనుల ముందు.. ఇవన్నీ ఉత్తవే. కానీ.. జనాలు వీటినే హైలెట్ చేస్తున్నారు తప్పితే మంచి పనుల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అదే జగన్ కు చెడ్డ పేరు తీసుకువస్తోంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొంచెం ఆలోచించి జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇటువంటి వాటి నుంచి ఈజీగా బయటపడొచ్చు. కొన్ని విషయాల్లో ఆచీతూచీ వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అని విశ్లేషకులు అంటున్నారు.